అత్తపై కోపంతో మరదలిపై అత్యాచారం

అత్తపై కోపంతో మరదలిపై అత్యాచారం

కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న అల్లుడే…అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మందుకు బానిసై.. మూడేళ్ల వయస్సున్న మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో జరిగింది.

బీహార్  రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ముగ్గురు కుమార్తెలతో కలిసి కొన్నేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చింది. కాటేదాన్‌ సమీపంలోని శాంతినగర్‌లో నివాసముంటోంది. మగతోడు లేని తన కుటుంబానికి అండగా ఉంటాడు కదా అని మూడేళ్ల క్రితం పెద్ద కుమార్తెను మేనల్లుడు రాజుకు ఇచ్చి పెళ్లి చేసింది. వారు కూడా ఇంటి సమీపంలోనే ఉంటున్నారు. రాజు పని చేయక పోగా తాగుడుకు బానిసయ్యాడు. రోజు భార్యను వేధిస్తూ… తాగేందుకు డబ్బులు కావాలంటూ అత్తను వేధించడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో… అత్తా అల్లుడి మధ్య తరుచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో అత్తపై కక్ష పెంచుకున్న రాజు శాంతినగర్‌లోని అంగన్‌వాడీకి వెళ్లిన తన భార్య చిన్న చెల్లెని.. మంగళవారం అంగన్‌వాడీ కేంద్రం నుంచి మరదలిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు రాజు. తర్వాత ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక ఏడుస్తుండటంతో ఏమైందని తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అల్లుడిపై ఫిర్యాదు చేసింది అత్త. పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాజును అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.