- 56 కిలోమీటర్లు.. 810 సర్వీసులు
- ప్రతి రోజూ 3.70 లక్షల మంది జర్నీ
- ఎంజీబీఎస్ – జేబీఎస్ రూట్ కూడా రెడీ
- అంచనాలకు మించి సక్సెస్
హైదరాబాద్, వెలుగు: సిటీలో మెట్రో రైల్ రెండేండ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ మియాపూర్లో సర్వీసులు ప్రారంభించగా, నవంబర్ 29 నుంచి నాగోలు టు మియాపూర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతి రోజూ 810 సర్వీసులతో 56 కిలోమీటర్ల ట్రాక్పై 3 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. సాధారణ రోజుల్లో ప్రతి ఆరు నిమిషాలకు ఒక రైలును నడిపిస్తూ…పీక్ అవర్స్లో ప్రతి మూడు నిమిషాలకో ట్రైన్తో సిటీజనాల కష్టాలు తీరుస్తోంది. మధ్యలో చిన్న చిన్న అవరోధాలు ఎదురైనా అన్నింటినీ ఎదుర్కొంటూ స్మార్ట్గా ముందుకు దూసుకెళ్తోంది. ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచి ఎన్నో అవార్డులందుకున్న మెట్రో.. కారిడార్–2లో భాగమైన జేబీఎస్ –ఎంజీబీఎస్ వచ్చే నెలలో మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెడుతూ రణగొణ ధ్వనులకు దూరంగా స్మార్ట్, ఎకో ఫ్రెండ్లీ విధానాన్ని హైదరాబాదీ జీవనంలో భాగం చేసే లక్ష్యంతో సరిగ్గా రెండేండ్ల క్రితం హైదరాబాద్మెట్రో రైల్ ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్), ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో పబ్లిక్ – ప్రైవేటు పార్టనర్షిప్( పీపీపీ) విధానంలో రూపకల్పన జరిగింది. మొదటి విడతలో భాగంగా 2017 నవంబర్ 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో సేవలను ప్రారంభించారు. మరుసటి రోజు అంటే 2017 నవంబర్ 29 నుంచి సాధారణ ప్రజలకు పూర్తి స్థాయిలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి.
56 కిలోమీటర్ల జర్నీ
జంట నగరాల పరిధిలో మొత్తం 66 మెట్రో స్టేషన్లతో 72 కిలో మీటర్ల మేర మెట్రో సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కారిడార్–1(రెడ్ లైన్)లో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 29 కిలో మీటర్లు, కారిడార్–2 (గ్రీన్లైన్)లో జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు15 కిలో మీటర్లు, కారిడార్–3(బ్లూ లైన్)లో నాగోలు నుంచి రాయదుర్గం వరకు 28 కిలోమీటర్లు మెట్రో నిర్మించాలని ప్రతిపాదించారు. పూర్తయిన మేర ప్రస్తుతం 56 కిలో మీటర్ల పరిధిలో తిరుగుతున్న మెట్రోను నిత్యం 3.70 లక్షల నుంచి నాలుగు లక్షల మంది సిటిజెన్స్ వినియోగించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో ప్రతి ఆరు నిముషాలకు ఒక రైలు నడిపిస్తుండగా.. పీక్ అవర్స్లో ప్రతి మూడు నిమిషాలకు మెట్రో రైలు తిరుగుతోంది.
MORE NEWS:
అమీర్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర యువతి మృతి
హైదరాబాద్ మెట్రో రైల్: వాట్సాప్లో సలహాలు, ఫిర్యాదులు
మెట్రో నిర్మాణంలో మైలురాళ్లు
- 2012 ఏప్రిల్ 26న భూమి పూజ నిర్వహించారు.
- 71.16 కిలోమీటర్ల మెట్రో లైన్ పనులను ఆరు దశలుగా విభజించారు.
- 2013 నవంబర్లో నాగోలు నుంచి మెట్టుగూడ మధ్య మెట్రో వయాడక్ట్ పై పట్టాలు వేయడం ప్రారంభించారు.
- 2014 మే మూడో వారంలో కొరియా నుంచి మొట్టమొదటి అత్యాధునిక మెట్రో రైలు హెచ్ఎంఆర్కు వచ్చింది.
- 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి పరీక్షలతో కూడిన టెస్ట్(ఇంటర్నల్) ట్రయల్ రన్స్ నిర్వహించారు. 2015 అక్టోబర్లో మియాపూర్ నుంచి సంజీవరెడ్డి నగర్ మధ్య అధికారికంగా ట్రయల్ రన్స్ నిర్వహించారు.
- 2016 ఆగస్టు 9-,10 తేదీల్లో మియాపూర్ నుంచి ఎస్ఆర్నగర్ వరకూ పనులను కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్ఎస్) సందర్శించింది.
- 2017 నవంబర్లో మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు12 కిలోమీటర్ల లైన్కు, నాగోలు- నుంచి మెట్టుగూడ వరకు10 కిలోమీటర్ల మేర సీఎంఆర్ఎస్ సేఫ్టీ అప్రూవల్ వచ్చింది.
- 2017 నవంబర్ 28న నాగోలు నుంచి మియాపూర్కు ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో సేవలను ప్రారంభించారు. 29 నుంచి సాధారణ ప్రజలకు పూర్తి స్థాయిలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి.
- 2018 సెప్టెంబర్ 24లో అమీర్పేట నుంచి ఎల్బీనగర్ వరకు 16 కిలోమీటర్ల పరిధిలో కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి.
- 2019 మార్చి 20న అమీర్పేట నుంచి హైటెక్సిటీ రూట్లో పరిమిత సేవలు స్టార్ట్అయ్యాయి. 2019 ఆగస్టు 20న హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రివర్సల్ సేవలు అందిస్తున్నారు.
- 2019 నవంబర్ 25న జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో ట్రయల్ రన్ నిర్వహించారు.
అభినందనల మెట్రో
- 2013, 2014, 2015: ‘రాయల్ ఫర్ ప్రివెన్సన్ ఆఫ్ యాక్సిడెంట్స్ గోల్డ్ అవార్డును యూకో నుంచి అందుకుంది.
- 2013: కన్ స్ట్రక్సన్ వీక్ ఇండియా నుంచి మెట్రో రైల్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్ -2013ను సొంతం చేసుకుంది.
- 2013 ఫిబ్రవరి: ‘ది గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్’ అవార్డు.
- 2016: ఉత్తమ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్టు ఇన్ ఇండియా -2016 గుర్తింపు పొంది ఎస్కేఓసీఎహెచ్ ప్లాటినమ్ అవార్డు .
- 2017: స్టేషన్లలో సేవలకు గాను హైజీబీసీ ప్లాటినం రేటింగ్ వచ్చింది.
- 2019: డైనమిక్ స్మార్ట్ ఇన్నోవేటర్ –2019 అవార్డును అందుకుంది.
అనేకసార్లు వార్తల్లో..
- 2019, నవంబర్19: టెక్నికల్ సమస్యల కారణంగా బేగంపేట నుంచి అమీర్పేట స్టేషన్ల మధ్య రైల్ కోచ్ ఆగిపోయి రెండు గంటలు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
- 2019, సెప్టెంబర్23: అమీర్పేట మెట్రో స్టేషన్ పెచ్చులూడి వివాహిత మృతి. ఇది మెట్రో చరిత్రలో ఓ విషాదం.
- 2019, ఆగస్టు14: ఎల్బీనగర్ వెళ్తున్న మెట్రో రైల్లో పాము ఉన్నట్టు దిల్సుఖ్ నగర్ స్టేషన్ వద్ద గుర్తించారు.
- 2018 నవంబర్: అమీర్పేటకు వెళ్తున్న మెట్రోట్రైన్కు పవర్ సప్లయ్ నిలిచిపోయింది. గంట రాకపోకలు సాగలేదు.
- 2018 మే: కూకట్పల్లిలో వైర్లు తెగిపడటంతో రైళ్లు అరగంట పాటు ఆగిపోయాయి. పొల్యూషన్తో డోర్లు ఒపెన్అవడంతో నాగోలులో రైలు నిలిచిపోయింది.
ప్రమాదాలు లేకుండా చూడాలి
నేను నాగోలు నుంచి బేగంపేటకు మెట్రోలో వస్తుంటాను. అప్పుడప్పుడు రైళ్లు ఆగిపోతున్నాయి. ఆర్టీసీ సమ్మె ఉండటంతో ఎక్కువ మంది మెట్రోనే ఎక్కుతున్నారు. కొంచెం రద్దీగా ఉంటుంది. మెట్రో ఫిల్లర్లపై అక్కడక్కడ పెచ్చులు ఊడుతున్నాయి. బైక్ల మీద వెళ్తున్నపుడు భయం వేస్తుంటుంది. అమీర్పేటలో మహిళ చనిపోయాక కొంచెం ఆందోళనగా ఉంటోంది.
– నిమ్మనపల్లి అమృత్, ప్రయాణికుడు
సెక్యూర్డ్ ఫీలింగ్తో జర్నీ
మెట్రో రైళ్లలో సెంట్రల్ ఏసీ ఉంటుంది. ప్రయాణించినంతసేపు ప్రశాంతంగా ఉంటుంది. లేడీస్కు ప్రత్యేకంగా స్పేస్ కేటాయించడం హర్షణీయం. స్టేషన్లలో సెక్యూరిటీ, స్టాఫ్ సహకరిస్తుంటారు. సెక్యూర్డ్ ఫీలింగ్తో జర్నీ చేస్తున్నా. ఈవ్టీ జింగ్, జనాల మధ్య ఇబ్బందులు పడుతూ నడిచే బాధలు లేవు.
– శివాని, ఎంప్లాయ్