
హైదరాబాద్, వెలుగు: హాంబర్గ్లో నిర్వహించిన యూఐటీపీ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ఆసియా పసిఫిక్ రీజియన్కు సంబంధించిన అవార్డును ఎల్అండ్ టీ మెట్రో రైల్ సొంతం చేసుకుంది. "ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇన్క్రీజ్డ్ రెవెన్యూ పర్ ట్రైన్" అనే ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్కు ఈ అవార్డు లభించింది. డేటా ఆధారిత షెడ్యూలింగ్, ఎనర్జీ ఎఫిషియెంట్ ఆపరేషన్స్, ఆప్టిమల్ ట్రైన్ డిప్లాయ్మెంట్పై దృష్టి సారించడం, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం, ట్రైన్ ట్రిప్ కు అధిక రెవెన్యూ సాధించడం తదితర అంశాల ప్రాతిపదికన ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవార్డుల కోసం 100 దేశాల నుంచి 1,900కు పైగా సంస్థలు 500కు పైగా ఎంట్రీలు సమర్పించాయి. ఆపరేషనల్ ఎక్సలెన్స్ కేటగిరీలో టాప్ ఫైవ్ ఫైనలిస్ట్లలో చోటు దక్కించుకున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్, డేటా డ్రివెన్ విధానంతో ఈ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. "యూఐటీపీ నుంచి ఈ అవార్డు అందుకోవడం మా ఇన్నోవేషన్, ప్రయాణికుల సౌకర్యంపై దృష్టిని ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ మెట్రో ప్రాజెక్ట్గా హైదరాబాద్ మెట్రో గ్లోబల్ స్టేజ్లో నిలవడం గర్వకారణం" అని చెప్పారు.