
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు చాలా హ్యాపీగా ఉన్నారని, ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండే పార్టీలు ఉన్నాయని, ఒకటి టీడీపీ అయితే రెండోది జగన్ పార్టీ వైసీపీ అని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి.. రాజమండ్రిలో జైలులో ఉన్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు ఓవైసీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రం ఎప్పటికీ నమ్మలేమని, ప్రజలు కూడా ఆయన్ని ఎప్పుడూ నమ్మొద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ విషయంపైనా అసదుద్దీన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మజ్లిస్ కార్యకర్తలతో హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.