పర్మిషన్ లేకుండానే రోడ్లను తవ్వేస్తున్నరు

పర్మిషన్ లేకుండానే రోడ్లను తవ్వేస్తున్నరు

 

  • డ్రైనేజీ నాలాలో పడి చనిపోతున్న చిన్నారులు
  • ప్రతి ఏటా ఘటనలు జరుగుతున్నా 
  • పట్టించుకోని బల్దియా, వాటర్ బోర్డు

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ పరిధి కలాసిగూడలో జీహెచ్ఎంసీ, వాటర్​బోర్డ్ అధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది.  కలాసిగూడలో డ్రైనేజీ కనెక్షన్ కోసం అధికారులు రోడ్డును తవ్వి పైప్ వేశారు. ఆ పైప్​లైన్​ను రోడ్డు కింద  ఉన్న నాలాకు లింక్ చేశారు. తర్వాత గుంతను పూడ్చకుండా అలాగే వదిలేశారు. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పైప్​ పక్కన గుంత పెద్దది కావడంతో పాటు నీళ్లు నిండి ఉండటంతో 11 ఏండ్ల బాలిక మౌనిక అందులో పడిపోయింది. నాలాలో కొంతదూరం కొట్టుకెళ్లి చనిపోయింది. ఎన్​వోసీలు తీసుకోకుండానే వాటర్​బోర్డు అధికారులు పైప్​లైన్ పనులు, డ్రైనేజీ, కేబుల్స్​పనులంటూ రోడ్లు తవ్వి.. ఆ తర్వాత తిరిగి వేయడం లేదు. కొన్నిచోట్ల కేవలం మట్టి పోస్తుండగా, మరికొన్ని ఏరియాల్లో అలాగే వదిలేస్తుండటంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని జనం ఆరోపిస్తున్నారు.

రూల్స్​కు విరుద్ధంగా..

గ్రేటర్ పరిధిలో రోడ్లను తవ్వాలంటే బల్దియా నుంచి ఎన్​వోసీ(నాన్​అబ్జక్షన్ సర్టిఫికెట్) తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాలు పడే అవకాశం ఉందన్న సమయంలో రోడ్లను తవ్వకూడదు. కానీ ఈ రూల్స్​ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్​వోసీలు తీసుకోకుండానే అడ్డగోలుగా రోడ్లు తవ్వుతున్నారు. కొన్ని చోట్ల రాత్రికి రాత్రే రోడ్లను తవ్వి పనులు చేసుకొని అలాగే వదిలేస్తున్నారు. ఎన్​వోసీల విషయంపై బల్దియా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. 

జీహెచ్ఎంసీ, వాటర్​బోర్డ్ అధికారులు, పోలీసులు కలిసి నిర్వహించాల్సిన కన్వర్జెన్సీ సమావేశాలు కూడా జరగట్లేదు.  భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసినా బల్దియా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ‘2020 సెప్టెంబర్​లో​ నేరేడ్​మెట్ పరిధిలోని నాలాలో పడి మా పాప సుమేధ చనిపోయి మూడేండ్లయినా బల్దియా పనితీరులో మార్పు లేదు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన జీహెచ్ఎంసీ ఏం చేస్తోందో అర్థం కావట్లే. ఈ విషయాలను మేయర్, కమిషనర్ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి ఘటనలకు భాధ్యత ఎవరు వహిస్తారు. ప్రభుత్వానికి జనాల ప్రాణాలంటే లెక్కలేకుండా పోతోంది’ అని సుమేధ తల్లి సుకన్య ఆవేదన వ్యక్తం చేసింది. 

9 ఏండ్లలో ఏం చేశారు?

ప్రతి విషయంలో గత ప్రభుత్వాలపైనే  బీఆర్ఎస్ సర్కారు ఆరోపణలు చేస్తోంది. అయితే 9 ఏండ్లలో  ఈ ప్రభుత్వం ఏం చేసింది.  బల్దియా కమిషనర్ బయటకు రావడం లేదు.  పాలన అంతా ట్విట్టర్​లోనే సాగుతోంది. బల్దియా కౌన్సిల్ సమావేశంలో చర్చ జరగడం లేదు. వాటర్ బోర్డు ఎండీ మీటింగ్​కి కూడా రావడం లేదు.  చిన్నారి మృతికి జీహెచ్ఎంసీనే కారణం. 
– రాజశేఖర్ రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్

 2 నెలలుగా లేఖలు రాస్తున్న

వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీని గురించి 2 నెలలుగా మేయర్, కమిషనర్​కు లేఖలు రాస్తున్నా స్పందించడం లేదు.  నాలా సేఫ్టీ విషయంలో  సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్న  మంత్రి కేటీఆర్ మాటలు ఏమైనయ్.  చిన్న వర్షం పడితే నగరం అతలాకుతలం అవుతోంది. ‘జనం చనిపోతే నేను ఏం చేస్తా’ అని ఎస్​ఎన్​డీపీ చీఫ్ జియావుద్దీన్ సమాధానం ఇవ్వడం దారుణం. కలాసిగూడలో బారికేడ్లు ఏర్పాటు చేసుంటే చిన్నారి చనిపోయేది కాదు. కింది స్థాయి అధికారులను సస్పెండ్  చేసి మేయర్, కమిషనర్ చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇంజనీర్ చీఫ్​ను సస్పెండ్ చేయాలె.  నగరంలో ఇంత జరుగుతుంటే మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారు? 
– శ్రవణ్, మల్కాజిగిరి కార్పొరేటర్