గచ్చిబౌలి: ఈ ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్లో సైబరాబాద్ షీ టీమ్స్ కు కంప్లయింట్లు తగ్గినట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్లో 102 కంప్లయింట్స్ రాగా గత నెలలో కేవలం 75 మాత్రమే వచ్చాయన్నారు. వాట్సాప్ ద్వారా 50, విమెన్ సేఫ్టీ వింగ్కు నేరుగా 11 అందాయన్నారు. వీటిల్లో ఫోన్ వేధింపులు 24, బ్లాక్మెయిలింగ్కు సంబం ధించి13 కంప్లయింట్లు ఉన్నాయన్నారు. మొత్తం 11 కేసులు నమోదు కాగా అందులో 6 క్రిమినల్, 5 పిటీ కేసులున్నాయన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ సభ్యులు 475 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్
హైదరాబాద్, వెలుగు: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఫిట్నెస్ను ప్రోత్సహించేందుకు కెనరా బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 3.0’ ఉత్సాహంగా సాగింది. నెక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞాన్ భూమి వద్ద కెనరా బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ హెడ్, చీఫ్ జనరల్ మేనేజర్ కేహెచ్ పట్నాయక్ జెండా ఊపి ఈ రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్దీగా ఉండేందుకు ఫిట్ నెస్ ను జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలని సూచించారు. 200 మందికిపైగా కెనరా బ్యాంక్ సిబ్బంది ఈ రన్లో పార్టిసిపేట్ చేశారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఆర్. అనురాధ, రీజనల్ ఆఫీసు అధికారులు మమతా జోషి, విజయ కుమార్, అనంత్ జలోన్హా, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ పటేల్ సేవలు మరువలేం : మెజీషియన్ సామల వేణు
హైదరాబాద్/పద్మారావునగర్/గండిపేట, వెలుగు: భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివని ప్రముఖ మెజీషియన్ సామల వేణు అన్నారు. సోమవారం పద్మారావునగర్లోని సర్దార్ పటేల్ డిగ్రీ, పీజీ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళం(అలుమ్ని) నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన మెజీషియన్ సామల వేణును స్టూడెంట్లు ఘనంగా సన్మానించారు. అనంతరం సర్దార్ పటేల్ ఫొటో వద్ద సామల వేణు నివాళులర్పించారు. కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్ రెడ్డి, నేషనల్ ఫ్యూల్ ఆర్గనైజేషన్ సీఈవో జయరామ్, ఐఏఎస్ అధికారి చంద్రవదన్, మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ, రిటైర్డ్ ఐపీఎస్ బి.మరియ కుమార్, తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ మాజీ డైరెక్టర్ గాండ్ల విజయ్ కుమార్, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ దినకర్ బాబు పాల్గొన్నారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా బల్దియా హెడ్డాఫీసులో, ఖైరతాబాద్లోని వాటర్ బోర్డు హెడ్డాఫీసులో, నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ లోనూ జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. అత్తాపూర్ డివిజన్ హైదర్ గూడ చౌరస్తాలోని పటేల్ విగ్రహానికి బీజేపీ చేవెళ్ల సెగ్మెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, కార్పొరేటర్ సంగీత పూలమాల వేసి నివాళులర్పించారు.
యూనియన్ బ్యాంక్లో యోగా సెషన్లు
హైదరాబాద్, వెలుగు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 104వ ఫౌండేషన్ డే వేడుకల్లో భాగంగా ఉద్యోగుల ఆరోగ్యం కోసం యోగా సెషన్స్ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ప్రతి వారం ఉద్యోగులకు యోగా సెషన్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో యోగా సెషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జోన్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెంటర్లలో సెషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచించారు. బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ కరణం అజిత్ ఆధ్వర్యంలో మొదలైన ఈ యోగా సెషన్లో సైఫాబాద్ లోకల్ రీజనల్ హెడ్ శ్రీధర్ బాబు, పంజాగుట్ట లోకల్ రీజనల్ హెడ్ దుందీశ్వర్ రావ్, స్టాఫ్ మెంబర్స్ పాల్గొన్నారు.