వాటర్​బోర్డు షాక్: ఇంకుడు గుంత లేకుంటే.. వాటర్ ఛార్జీల మోత మోగుద్ది

వాటర్​బోర్డు షాక్: ఇంకుడు గుంత లేకుంటే.. వాటర్ ఛార్జీల మోత మోగుద్ది
  • ఇంకుడు గుంత లేకుంటే వాటర్ ట్యాంకర్ చార్జీలు ‘డబుల్’

  • వచ్చే వేసవి నుంచి అమలు చేయాలని వాటర్​బోర్డు నిర్ణయం

  • అక్టోబర్ 2 నుంచి స్పెషల్ డ్రైవ్ 

  • ఇంకుడు గుంతలు నిర్మించుకునేవారికి సహకారం

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​సిటీలో భూగర్భ జలాలు పెంచేందుకు వాటర్​బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను తప్పనిసరి చేయాలని డిసైడ్​అయింది. ఇంకుడు గుంత తవ్వించుకోకపోతే వాటర్​ట్యాంకర్ల చార్జీలను డబుల్​చేసి వసూలు చేయాలని నిర్ణయించింది. గత వేసవిలో సిటీలో భూగర్భ జలాలు అడుగంటడంతో వేర్వేరు జలాశయాల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్​చేయాల్సి వచ్చింది. డిమాండును బట్టి వాటర్​బోర్డు ఒక రోజులో 12 వేల వాటర్​ట్యాంకర్లను సప్లయ్​చేసింది. అప్పటికీ చాలాచోట్ల తాగునీటి కోసం జనం ఇబ్బంది పడ్డారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ముందస్తు ప్లాన్​ సిద్ధం చేస్తున్నారు.

‘ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత’ నినాదం

అక్టోబర్ 2 నుంచి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్కీంలో భాగంగా ‘ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత’ అనే నినాదంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వాటర్​బోర్డు నిర్ణయించింది. ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ముందుకొచ్చేవారికి జియాలజిస్టులతో టెక్నికల్​సహకారం ఇవ్వాలని ప్లాన్​చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీరణంలో నిర్మించే ఇండ్లలో తప్పనిసరిగా ఇంకుడు గుంత తవ్వించుకోవాలి. 

నల్లా కనెక్షన్ పర్మిషన్ లెటర్ లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు నిబంధన ఉంటుంది. అయితే చాలా మంది ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం లేదు. నిర్మించుకున్నా మెయింటెనెన్స్​చేయడం లేదు. ప్రస్తుతం అధికారులు వారందరి వివరాలు సేకరిస్తున్నారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఇంకుడు గుంతల కోసం సర్వేను ప్రారంభించారు. 300 చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఇండ్ల క్యాన్ నంబర్ల ఆధారంగా ఇంకుడు గుంతల స్థితిగతులపై సర్వే చేస్తున్నారు.

 ముందుగా 42,784 ఇండ్లను తనిఖీ చేయాలని నిర్ణయించగా, ఈ నెల 18 నాటికి  25,578 ఇండ్ల సర్వే పూర్తయింది. 13,132 ఇండ్లలో ఇంకుడు గుంతలు లేవని గుర్తించారు. వచ్చే వేసవి నాటికి ఇంట్లో ఇంకుడు గుంత లేకుంటే.. సదరు యజమాని తాగునీటి ట్యాంకర్​బుక్​చేసుకుంటే డబుల్​చార్జీలు వసూలు చేయాలని వాటర్​బోర్డు నిర్ణయించింది.