- కొండాపూర్లో నాలుగెకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
- పార్కు స్థలాలకు బై నంబర్లు వేసి అమ్మేసిన వ్యక్తులు
- రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదుతో భూమికి ఫెన్సింగ్ వేసిన అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో వందల కోట్ల విలువైన స్థలాన్ని హైడ్రా కాపాడింది. దాదాపు నాలుగెకరాల ప్రభుత్వ స్థలానికి కొంతమంది బైనంబర్లు వేసి కొట్టేయడానికి ప్రయత్నించగా, వారిని హైడ్రా అడ్డుకుంది. ఈ ప్రాంతంలో ఎకరం రూ.200 కోట్లు ఉండగా, ఈ స్థలం విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కొండాపూర్లో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో శ్రీవేంకటేశ్వర హెచ్ఏఎల్ కాలనీని 1980లో ఏర్పాటు చేశారు. ఇందులో 1.20 ఎకరాల చొప్పున రెండు పార్కులు, మరో రెండెకరాల పరిధిలో మరో పార్కుకు, 1,000 గజాల మేర ఇతర అవసరాల కోసం కేటాయించారు.
అయితే, కొందరు వ్యక్తులు ఈ పార్కుల్లోని స్థలాలకు బై నంబర్లు వేసి ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. దీనిపై దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీవేంకటేశ్వర హెచ్ఏఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు అక్కడికి వెళ్లి స్థలాన్ని పరిశీలించగా, పార్కు అక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఎన్ఆర్ఐల దగ్గర నుంచి సింహా డెవలపర్స్, వాసవి నిర్మాణ సంస్థతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కొన్నట్లు తెలుసుకుంది. అయితే, పార్కుల వైపు వెళ్లకుండా బౌన్సర్లను పెట్టి అడ్డుకున్నారని కాలనీ ప్రతినిధులు ఆరోపించారు.
ఇదే అంశంపై రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును కూడా ఆశ్రయించగా, స్థలాలను కాపాడాలని కోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డులను ఏర్పాటు చేశారు. హైడ్రా వెళ్లిన సమయంలోనూ సింహా డెవలపర్స్, వాసవి నిర్మాణ సంస్థలు ఈ భూమితో తమకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. బై నంబర్లతో ఆ స్థలాన్ని ఎవరు విక్రయించారనే విషయాన్ని హైడ్రా దర్యాప్తు చేస్తోంది.
