- తుర్కచెరువు, ఎర్రకుంట, కాముని చెరువు సందర్శన
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో రెండో విడత చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. బాచుపల్లిలోని ఎర్రకుంట, నిజాంపేట్లోని తుర్కచెరువు, మూసాపేట్లోని కామునిచెరువు పనులను తనిఖీ చేశారు. జీపీఆర్ లేఅవుట్లో మురుగునీరు నిలుస్తోందని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన.. జీపీఆర్ లేఅవుట్లో కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తుర్కచెరువులో పూడికతీత చేపడుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కమిషనర్ కు సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుర్కచెరువు సమీపంలోని ఆలయాలన్నింటినీ ఒక్కచోటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానికులు, ఆలయ కమిటీల ప్రతినిధులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం మూసాపేట్ కామునిచెరువును పరిశీలించిన ఆయన, ఈ చెరువు అభివృద్ధి పనులు పూర్తయితే నగరానికే తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
