
హైదరాబాద్ సిటీ, వెలుగు: నాలాల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు స్పీడప్చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. నాలాల్లో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలని, నాలా ఆక్రమణలుంటే తొలగించాలన్నారు. శుక్రవారం చింతల్బస్తీ మీదుగా సాగే బుల్కాపూర్ నాలా విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. చింతలబస్తీలో మూడ్రోజుల క్రితం తొలగించిన నాలా ఆక్రమణల కింద భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించాలన్నారు.
శంకర్ పల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి వచ్చే నాలా మియాఖాన్ గడ్డ, జన్వాడ, ఖానాపూర్, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, రాయదుర్గం, ఓయూకాలనీ, షేక్పేట, బీజేఆర్ నగర్, మహాత్మాగాంధీ నగర్, హఖిమ్సా విరాట్నగర్, బృందావన్ కాలనీ, టోలిచౌకి, మెహిదీపట్నం మిలటరీ ఏరియా, బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12, చింతలబస్తీ, తుమ్మలబస్తీ, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్ సాగర్కు వరదనీరును తీసుకువస్తుంది.
హైడ్రా కూల్చివేతల్లో పైప్లైన్ ధ్వంసం... పునరుద్ధరించిన వాటర్బోర్డు
చింతల్ బస్తీలో ఇటీవల హైడ్రా అధికారులు నాలాల కబ్జాలను తొలగించే సమయంలో ధ్వంసమైన వాటర్బోర్డు మెయిన్ పైప్ లైన్కు అధికారులు రిపేర్లు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ పనులను ఎండీ అశోక్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైడ్రా నాలా ఆక్రమణ తొలగింపు సందర్భంగా బంజారాహిల్స్ సంప్ ఔట్ లెట్ నుంచి మసాబ్ ట్యాంక్, ఏసీ గార్డ్స్ కు మంచినీటిని సరాఫరా చేసే 300 ఎంఎం డయా పైప్లైన్ దెబ్బతిన్నది. స్పందించిన అధికారులు రిపేర్లు పూర్తి చేసి సరఫరా పునరుద్ధరించారు. అంతకు ముందు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచిత ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు.