
న్యూఢిల్లీ: ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్బస్టర్ ఐపీఓ ఇన్వెస్టర్ల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. హ్యుందాయ్ ఇండియన్ మార్కెట్ల నుంచి రూ. 25 వేల కోట్ల వరకు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఐపీఓ ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో ఉండొచ్చని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. దేశంలోని కార్ల మార్కెట్లో హ్యుందాయ్ ఇండియా రెండో ప్లేస్లో కొనసాగుతోంది. కంపెనీ ఐపీఓకి వస్తే ఇన్వెస్టర్లు ఎగబడతారని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
మారుతి సుజుకీ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు. హ్యుందాయ్ ఇండియా సుమారు 15–20 శాతం వాటాను అమ్మి 3.3 బిలియన్ డాలర్ల నుంచి 5.6 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్ల నుంచి రూ.46 వేల కోట్ల) వరకు సేకరించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కంపెనీ ఐపీఓకి వస్తే ఎల్ఐసీ ఐపీఓ (రూ.21 వేల కోట్ల ఇష్యూ సైజ్) కంటే పెద్దది అవుతుంది. ఈ విషయంపై హ్యుందాయ్ ఇండియా స్పందించలేదు. కాగా, ఈ కొరియన్ కంపెనీ 1996 నుంచి ఇండియాలో బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం 13 మోడల్స్ను అమ్ముతోంది.