
పనులు చేశాకే ఓట్లకు రావాలి
మెదక్జిల్లా బిట్ల తండాలో మదన్రెడ్డి, నర్సాపూర్ అభ్యర్థి సునీతారెడ్డిపై గిరిజనుల ఆగ్రహం
కౌడిపల్లి, వెలుగు: ఏం చేశారని తండాకు ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ గిరిజన మహిళలు, యువకులు బీఆర్ఎస్పార్టీ ప్రచారాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. మెదక్జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా రెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి శుక్రవారం కౌడిపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగంపల్లి పంచాయతీ పరిధిలోని బిట్ల తండాలో గిరిజనులు ప్రచారాన్ని అడ్డుకుని నేతలను నిలదీశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రోడ్లు, అంగన్వాడీ, పంచాయతీ బిల్డింగ్ మంజూరు చేస్తామని, పోడు భూములకు పట్టాలిస్తామని గత ఎన్నికలప్పుడు చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చిన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి, మిగతావారు పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నా పట్టించుకోలేదన్నారు. అలాంటిది ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
తండాలో జాగలు ఉండి రూ.2 లక్షలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారని, 36 మంది అప్పు చేసి 2 లక్షలు ఇచ్చారని, కాంట్రాక్టర్ కొందరి ఇండ్లను పిల్లర్ల స్థాయిలోనే వదిలేసి వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీ నవీన్కుమార్ ను అడ్డుకొని తమ ఓట్లు కావాలంటే ముందు తండాలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే తండాకు రాకుండా గేటు ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీపై తమకు నమ్మకం పోయిందని, ఇక ఏం చెప్పినా నమ్మెటోళ్లు ఇక్కడ లేరన్నారు. ఇంకోసారి తండాకు రావద్దంటూ తేల్చిచెప్పారు.