మాస్కు కట్టుకోను, అయితే ఏంటి?: మధ్యప్రదేశ్ హోం మంత్రి

మాస్కు కట్టుకోను, అయితే ఏంటి?: మధ్యప్రదేశ్ హోం మంత్రి

ఇండోెర్: మాస్క్ కట్టుకోకుంటే ఏమవుతుందని, తాను మాస్కు ధరించనని మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తం మిశ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. బుధవారం ఓ ఈవెంట్‌‌లో పాల్గొన్న నరోత్తం మిశ్రా మాస్కు లేకుండా కనిపించారు. స్టేట్ గవర్నమెంట్ పథకమైన సంబాల్ యోజన కింద పేద ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ వారికి సాయం చేసే కార్యక్రమంలో నరోత్తం పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌‌లో గుమిగూడిన కొందరు ప్రజలు, రిపోర్టర్ల మధ్య నరోత్తం మాస్కు కట్టుకోకుండా మాట్లాడటం గమనార్హం. ‘ఇలాంటి ఈవెంట్ల సమయంలో నేను మాస్కులు కట్టుకోను. కట్టుకోకుంటే ఏమవుతుంది? నేను మాస్కు కట్టుకోను’ అని నరోత్తం పేర్కొన్నారు.

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నరోత్తం క్షమాపణలు చెప్పారు. ఇప్పటి నుంచి మాస్కు కట్టుకుంటానన్నారు. ‘సాధారణంగా నేను మాస్కు కట్టుకుంటా. కానీ దాన్ని ఎక్కువ సేపు వేసుకోవడం నా వల్ల కాదు. పాలీపస్‌‌తో బాధపడుతున్నా కాబట్టి నాకు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి’ అని నరోత్తం వివరణ ఇచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో హోం మినిస్టర్‌‌గా ఉన్న నరోత్తం.. మరికొన్ని పోర్ట్‌‌ఫోలియోలను కూడా చూసుకుంటున్నారు.