- రూ.45 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవో
మహబూబాబాద్/దంతాలపల్లి, వెలుగు : వెంచర్ పర్మిషన్ కోసం లంచం తీసుకున్న మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్యను ఏసీబీ ఆఫీసర్లు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నరసింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి పక్కన నాలుగు ఎకరాల్లో వెంచర్ చేసేందుకు వరంగల్ ఆర్డీడీ ఆఫీస్లో అప్లై చేసుకున్నాడు.
ఆ ఫైల్ నర్సింహులగూడెం ఎంపీడీవో ఆఫీస్కు చేరుకుంది. అయితే... ఆ వెంచర్లో తన భూమి సైతం కలిసిందని, పర్మిషన్ ఇవ్వొద్దని పక్క భూమి యజమాని నర్సింహులపేట ఎంపీడీవో రాధిక, ఎంపీవో కిన్నెర యాకయ్యను కోరాడు. దీంతో వెంచర్ యజమాని సర్వే చేయించి, హైకోర్టును ఆశ్రయించగా.. అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే వెంచర్కు పర్మిషన్ ఇచ్చేందుకు రూ. లక్ష ఇవ్వాలని ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్య డిమాండ్ చేశారు.
దీంతో సదరు వెంచర్ యజమాని గతంలోనే రూ. 50 వేలు ఇచ్చాడు. తర్వాత మరో రూ. 45 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని ఎంపీడీవో, ఎంపీవో స్పష్టం చేయడంతో వెంచర్ యజమాని ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు శుక్రవారం నర్సింహులపేట ఎంపీడీవో ఆఫీస్కు వెళ్లాడు.
అక్కడ ఉన్న ఎంపీడీవో రాధిక కుమారుడు నాగార్జునకు డబ్బులు తీసుకొని.. ఎంపీడీవోతో పాటు ఎంపీవోకు ఇచ్చాడు. అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు ఎంపీడీవో రాధికతో పాటు ఆమె కుమారుడు నాగార్జున, ఎంపీవో యాకయ్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఎంపీడీవో, ఎంపీవో ఏసీబీకి చిక్కిన విషయం తెలియడంతో ప్రజలు స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద పటాకులు కాల్చారు.
