
పూణేలోని హింజెవాడిలో ఎవరు ఊహించని షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 23 ఏళ్ల ఇంజనీర్ సొంత ఆఫీస్ బిల్డింగ్ ఏడవ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు పియూష్ అశోక్ కవాడే, అతను నాసిక్ వాసి, గత ఒకటిన్నర సంవత్సరాలుగా అట్లాస్ కాప్కో అనే మల్టి నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
ఛాతీ నొప్పిగా ఉందని : అశోక్ కవాడే ఎప్పటిలాగే ఆఫీసుకి వెళ్ళాడు. అదే రోజు ఒ మీటింగ్లో ఉండగా అనుకోకుండా ఛాతీ నొప్పిగా ఉందని చెప్పి మీటింగ్ నుండి వెళ్లిపోయాడు. కొద్ది నిమిషాల్లోనే అతను ఇంత పని చేస్తాడని ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా ఆఫీసులో ఉన్న వారు అతను బిల్డింగ్ నుండి కింద పడటం చూసి షాక్ అయ్యారు. తరువాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
జీవితంలో ఫేల్ అయ్యానని : పోలీసులకి అశోక్ కవాడే మృతి తరువాత ఒక సూసైడ్ నోట్ దొరికింది, అందులో నేను జీవితంలో అన్నిట్లో ఫేల్ అయ్యాను, దయచేసి నన్ను క్షమించండి అని రాసి ఉంది. అందులో నేను తండ్రికి తగ్గ కొడుకు కాదని, నేను చేసిన పని క్షమించమని కోరుతున్నట్లు రాసాడు.
పోలీసుల ప్రకారం సూసైడ్ నోట్ చదివిన తర్వాత, అశోక్ కవాడే జీవితంలో సక్సెస్ కాలేదని తనలో తాను కుమిలిపోయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అతను ఎక్కడా ఉద్యోగ సంబంధిత సమస్య లేదా ఆఫీసు ఒత్తిడి గురించి ప్రస్తావించలేదని పోలీసులు తెలిపారు.
పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులతో మాట్లాడారు. అలాగే బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. చదువుకొని ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు ఇలాంటి ఆలోచనకు రావడానికి గల కారణం ఏంటి అని పోలీసులు అరా తీస్తున్నారు.
మానసిక ఒత్తిడి చాలా హానికరం: అశోక్ కవాడే మరణం తర్వాత, ముఖ్యంగా యువతలో మానసిక ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ కెరీర్లో బిజీగా ఉన్న నేటి కాలంలో చాలా సార్లు ప్రజలు సమస్యలను ఎవరితోనూ చెప్పుకోరు. బయటికి బాగానే కనిపిస్తున్న లోపల చాలా బాధపడుతుంటారు అని పోలీసులు అన్నారు.