రాష్ట్రపతి, ప్రధాని పదవులను ఆఫర్ చేసినా తాను మాత్రం బీజేపీలోకి వెళ్లనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తేల్చి చెప్పారు. తన శవం కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కలిసి వెళ్లదన్నారు. తనను బీజేపీ హిందూ వ్యతిరేకి అని ట్యాగ్ చేసిందని, బీజేపీ ఎమ్మెల్యే ఒకరు తనను సిద్ధరాముల్లా ఖాన్ అని పిలుస్తున్నారని చెప్పారు. బీజేపీ, జేడీఎస్లకు సిద్ధాంతాలు, హేతుబద్ధత లేవని సిద్దరామయ్య విమర్శించారు.
తాను సీఎంగా ఉన్నప్పుడు అందరికీ ఆహార భద్రత కల్పించామని దానిని కోనసాగించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో ఇచ్చిన ఏడు కిలోల బియ్యాన్ని బీజేపీ ప్రభుత్వం ఐదు కిలోలకు తగ్గించిందని సిద్దరామయ్య తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతినెలా 10 కిలోల బియ్యంతో పాటు మహిళలకు రూ.2 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ పై సిద్దరామయ్య స్పందించారు. అది పూర్తి చేయని వాగ్దానాలతో కూడిన బడ్జెట్ అని విమర్శించారు. తనకు బడ్జెట్ పై ఎటువంటి అంచనాలు లేవన్న ఆయన... ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ కు చివరి బడ్జెట్ అని అన్నారు.