న్యూఢిల్లీ: కరోనాను సమర్థంగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే పలుమార్లు విమర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోమారు సర్కార్పై ధ్వజమెత్తారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్రంపై మండిపడ్డారు. యూఎస్ మాజీ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్తో శుక్రవారం జరిగిన వీడియో చాట్లో రాహుల్ పలు అంశాలపై మాట్లాడారు.
‘ఏకపక్షంగా డెసిజన్స్ తీసుకునే ప్రభుత్వం మనది. గవర్నమెంట్ కఠినమైన లాక్డౌన్ వేయాలని నిర్ణయించింది. దాని పరిణామాలు ఎలా ఉన్నాయో అందరూ చూస్తున్నారు. వేలాది వలస కూలీలు వేల కొలది కిలో మీటర్లు నడుచుకుంటూ తమ సొంతూళ్లకు చేరుకున్నారు. ఇలాంటి లీడర్షిప్ పెను విఘాతం కలిగిస్తుంది. మనం కరోనాపై పోరాడుతున్నాం. దాన్ని అధిగమిస్తామని నేను చాలా నమ్మకంగా ఉన్నా. మన దేశ డీఎన్ఏను నేను అర్థం చేసుకోగలను. వేల ఏళ్లుగా ఆ డీఎన్ఏ ఒకేలా ఉంది. అందులో ఎలాంటి మార్పూ లేదు. ఇది కఠినమైన సమయం. కానీ ఈ విపత్తు తర్వాత కొత్త ఐడియాలు పుట్టుకొస్తాయి. గతంలో కంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఒకరితో మరొకరు సహకరించుకుంటున్నారు. కలసి ఉండటంలో ఉన్న అడ్వాంటేజెస్ను వారు గుర్తిస్తున్నారు’ అని రాహుల్ చెప్పారు.