మళ్లీ అమెరికా అధ్యక్షుడిని అవుతా: ట్రంప్

మళ్లీ అమెరికా అధ్యక్షుడిని అవుతా: ట్రంప్

మరోసారి మళ్లీ తానే అమెరికా అధ్యక్షుడిని కావడం ఖాయమన్నారు అమెరికా అధ్యక్షుడు  ట్రంప్. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిస్తే  మార్కెట్లు భారీగా పుంజుకుంటాయని అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలోని US ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యారు.

సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. భారత్‌కు కష్టపడి పనిచేసే ప్రధాని ఉన్నారని,  ఆయన చాలా మొండి వ్యక్తి అని ఆయనే మోడీ అంటూ  ప్రశంసించారు ట్రంప్. తాము భారత్ లో ఉద్యోగాలు సృష్టిస్తే…మోడీ మీ ద్వారా అమెరికాలో ఉద్యోగాలు సృష్టిస్తున్నారన్నారు.

అంతేకాదు భారత పర్యటనకు తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు ట్రంప్. గొప్ప ఆతిథ్యమిచ్చిన భారత్ కు కృతజ్ణతలు చెబుతున్నానన్నారు. భారత ప్రధాని మోడీ  చాలా గొప్ప వ్యక్తి అని అన్నారు. అమెరికా నుంచి భారత్ కొనుగోళ్లు జరపడం ఆనందకరమన్నారు. భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయన్నారు. మరికొద్ది నెలల్లో మరిన్ని ఒప్పందాలు  కుదురుతాయని తెలిపారు. ఒబామా కేర్‌ను మించిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చినట్లు ట్రంప్ తెలిపారు.

అంతకుముందు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీ-ట్రంప్ సమక్షంలో రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.