హైదరాబాద్, వెలుగు: యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఐ) మాన్సూన్ రెగట్టా నేషనల్ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్షిప్ మంగళవారం హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ లేక్లో ప్రారంభమైంది. వర్షం, గాలుల వల్ల గంట ఆలస్యంగా మొదలైన తొలి రోజు పోటీల్లో సిటీకి చెందిన కొమరవెల్లి దీక్షిత సత్తా చాటింది. అండర్-15 ఆప్టిమిస్ట్ క్లాస్ గర్ల్స్ విభాగంలో మూడు రేసుల తర్వాత యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) సెయిలర్ దీక్షిత 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బాయ్స్లో ఎన్ఎస్ఎస్ మధ్యప్రదేశ్కు చెందిన ఏకలవ్య బాథమ్ నాలుగు పాయింట్లతో టాప్లో ఉన్నాడు.
అండర్-19 ఇంటర్నేషనల్ క్లాస్లో మధ్యప్రదేశ్ ఎన్ఎస్ఎస్కు చెందిన నాన్సీ రాయ్ –అనిరాజ్ సెంధవ్ జోడీ 5 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. వైసీహెచ్ సెయిలర్లు ధరణి –-వడ్ల మల్లేష్ 6 పాయింట్లతో రెండో ప్లేస్లో కొనసాగుతున్నారు.