
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్కప్పై అనిశ్చితి నెలకొంది. కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడం, చాలా దేశాల్లో లాక్డౌన్, ఆస్ట్రేలియాలో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ నేపథ్యంలో ఈ టోర్నీ షెడ్యూల్ ప్రకారం జరిగేలా లేదు. దాంతో, ఈ మెగా టోర్నీని 2022కి షిఫ్ట్ చేయాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. ఈ ఆప్షన్పై ఈ నెల 28న జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ మెగా టోర్నీ షిఫ్ట్ అయితే.. ఐపీఎల్కు మార్గం సుగమం కానుంది. 13వ సీజన్ నిర్వహణకు ఒక స్లాట్ అందుబాటులోకి రానుంది. ఐసీసీ బోర్డు మీటింగ్ తర్వాత క్రికెట్ కమిటీ సమావేశం జరగనుంది. బాల్పై చెమట, ఉమ్మి (సెలైవా) వాడకం సహా ఇతర ప్లేయింగ్ కండిషన్స్పై ఇందులో డిస్కస్ చేయనున్నారు. ఈ భేటీలో క్రిస్ టెట్లే నేతృత్వంలోని ఐసీసీ ఈవెంట్స్ కమిటీ.. టీ20 వరల్డ్కప్పై పలు ఆప్షన్లను వివరించనుంది. ‘ఐసీసీ ఈవెంట్స్ కమిటీ నుంచి మేం మూడు ఆప్షన్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొదటిది ప్లేయర్లను 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచడంతో పాటు ఫ్యాన్స్ను అనుమతించి టోర్నీని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడం. దీనికి బ్యాకప్గా ఎమ్టీ స్టేడియంలో నిర్వహించడం. టోర్నీని 2022కు షిఫ్ట్ చేయడం మూడో ఆప్షన్ కావొచ్చు’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ బోర్డు మెంబర్ చెప్పారు.
నవంబర్–డిసెంబర్లో ఇండియాతో జరగాల్సిన టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ ప్లేయర్లు పట్టుపడుతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఫైనాన్షియల్ హెల్త్కు ఈ సిరీస్ కీలకం కానుంది. ‘టీ20 వరల్డ్కప్ను 2022కు షిఫ్ట్ చేస్తే సీఏ పెద్దగా బాధపడకపోవచ్చు. అయితే, దీనిపై తుది నిర్ణయం మాత్రం బోర్డు మెంబర్లదే. ఒకవేళ ఇండియా–ఆసీస్ బైలేటరల్ సిరీస్ మరింత ముఖ్యమని మెంబర్లు నిర్ణయిస్తే.. వాళ్లను నిరుత్సాహపరచకూడదు. వరల్డ్కప్ను షిఫ్ట్ చేస్తే ఐసీసీ క్యాష్ ఫ్లో దెబ్బతింటుంది. కానీ, అది కొంతకాలం మాత్రమే ఉండే సమస్య. ఒకవేళ టోర్నీ 2022లో జరిగితే కౌన్సిల్కు వచ్చే ఆర్థిక నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఇది డిఫర్మెంట్ కానీ పోస్ట్పోన్మెంట్ కాదు. టీ20 వరల్డ్కప్ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలంటే 16 జట్ల ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, టీవీ సిబ్బందికి క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలి. దీనికి భారీగా ఖర్చవుతుంది. అలాగే, కొన్ని దేశాల్లో పరిస్థితి కంట్రోల్లోకి రాకపోతే.. ట్రావెలింగ్ సేఫ్ కాబోదు. అందువల్ల టోర్నీని కొన్ని నెలలు పోస్ట్పోన్ చేస్తున్నాం.. 2021 ఫిబ్రవరి–మార్చిలో నిర్వహిస్తాం అనలేం. పైగా, నెక్ట్స్ ఇయర్ విమెన్స్ వరల్డ్కప్ కూడా ఉంది. రెండు ఐసీసీ ఈవెంట్ల మధ్య క్లాష్ రాకూడదు’ అని సదరు మెంబర్ చెప్పుకొచ్చారు.