- బిజినెస్ విస్తరణపై ఫోకస్ పెట్టిన కంపెనీలు
- 50 శాతం వరకు గ్రోత్ నమోదు చేస్తామని వెల్లడి
- పాల ధరలు నిలకడగా ఉండడంతో మద్ధతు
న్యూఢిల్లీ : ఐస్క్రీమ్ తయారీ కంపెనీలు సమ్మర్కు సిద్ధమవుతున్నాయి. టెంపరేచర్స్ పెరుగుతుండడంతో బిజినెస్ విస్తరణపై ఫోకస్ పెంచాయి. అమూల్, మదర్ డెయిరీ, బాస్కిన్ రాబిన్స్ వంటి బ్రాండ్లు కొత్త స్టోర్లను ఓపెన్ చేస్తున్నాయి. ఈ ఏడాది సమ్మర్ కోసం సేల్స్ స్ట్రాటజీలను రెడీ చేసుకుంటున్నాయి. ఈ ఏడాది సమ్మర్లో బంపర్ గ్రోత్ రికార్డ్ చేస్తామని అమూల్ బ్రాండ్ను ఆపరేట్ చేస్తున్న గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పేర్కొంది. అమూల్ 25–30 శాతం గ్రోత్తో దూసుకుపోతోందని ఈ సంస్థ ఎండీ జయెన్ మెహతా అన్నారు.
కిందటేడాది సమ్మర్తో పోలిస్తే ఈసారి ఐస్క్రీమ్ అమ్మకాలు 45–50 శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేశారు. కిందటి వేసవిలో అకాల వర్షాల వలన సేల్స్ తగ్గాయని, లో–బేస్ కారణంగా ఈ ఏడాది సేల్స్ గ్రోత్ ఎక్కువగా ఉండనుందని అన్నారు. ‘ఐస్క్రీమ్ల తయారీని పెంచేందుకు అమూల్ రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటికే ఉన్న ప్లాంట్లను మరింత మెరుగుపరించింది. ఉజ్జయిన్, తలోజా (ముంబై), వారణాసి, కుచ్, సురేంద్రనగర్, పూణెలో ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్లలో ప్రొడక్షన్ మొదలయ్యింది’ అని మెహతా వివరించారు.
తమ సంస్థ ఆపరేట్ చేస్తున్న మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ల సంఖ్య 25 కి చేరుకుందని అన్నారు. అమూల్ తన రిటైల్ నెట్వర్క్ను కూడా పెంచుతోంది. ఐస్ లాంజ్లను ఏర్పాటు చేసి ప్రీమియం ఐస్ క్రీమ్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రస్తుతం 15 ఐస్ లాంజ్ స్టోర్లను అమూల్ ఆపరేట్ చేస్తోంది. ఈ ఏడాది సమ్మర్లో మరో 10 లాంజ్లను ఓపెన్ చేసే ప్లాన్లో ఉంది. ఈ ఏడాది ముగిసే నాటికి 100 ఐస్ లాంజ్ స్టోర్లను ఏర్పాటు చేస్తామని మెహతా అన్నారు. మదర్ డెయిరీ కూడా ఈ ఏడాది సమ్మర్పై ఆశలు పెట్టుకుంది.
ప్రొడక్షన్ కెపాసిటీని పెంచేందుకు రూ.50 కోట్లు ఇన్వెస్ట్ చేశామని ఈ కంపెనీ ఎండీ మనిష్ బండ్లిష్ అన్నారు. ఈసారి టెంపరేచర్స్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. కిందటేడాది సమ్మర్తో పోలిస్తే ఈ ఏడాది సమ్మర్లో తమ డెయిరీ ప్రొడక్ట్ల సేల్స్ 25–30 శాతం గ్రోత్ నమోదు చేస్తాయన్నారు. సాధారణంగా ఐస్ క్రీమ్ కంపెనీల సేల్స్లో 60 శాతం వేసవిలోనే జరుగుతాయి.
హోటల్స్, రెస్టారెంట్లు, కేటరింగ్ సెగ్మెంట్ల నుంచి వచ్చే డిమాండ్తో పాటు బయట జరిగే సేల్స్ ఐస్ క్రీమ్ కంపెనీలకు కీలకం. క్విక్ డెలివరీ కంపెనీలు రావడంతో ఇంటి దగ్గరనే ఐస్క్రీమ్ తినేవారు పెరుగుతున్నారని, సేల్స్ ఊపందుకున్నాయని కంపెనీలు చెబుతున్నాయి.
పెద్ద మార్కెట్.. బోలెడు అవకాశాలు
దేశంలో ఐస్క్రీమ్ మార్కెట్ సైజ్ 5.3 బిలియన్ డాలర్లు (రూ. 44 వేల కోట్లు) ఉంటుందని, 2028 వరకు ఏడాదికి 10.9 శాతం వృద్ధి చెందుతుందని స్టాటిస్టా అంచనా వేసింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అమూల్, క్వాలిటీ వాల్స్, వాడిలాల్, హ్యావ్మోర్ వంటి బ్రాండ్లు టాప్లో ఉన్నాయి. మరోవైపు మార్కెట్లో సగం వాటా రీజినల్ బ్రాండ్లలో చేతిలో ఉంది. ప్రైవేట్ లేబుల్స్తో ఐస్క్రీమ్ బ్రాండ్లూ మార్కెట్లోకి వస్తున్నాయి. హిందుస్తాన్ యూనిలీవర్ తన ఐస్ క్రీమ్ బిజినెస్ను మరింత విస్తరించాలని చూస్తోంది.
ప్రస్తుతం కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్లో ఈ సెగ్మెంట్ వాటా 3 శాతం కంటే తక్కువ ఉంది. ఐస్ క్రీమ్ బిజినెస్ను వేరు చేయడం లేదా వేరే కంపెనీకి అమ్మేయడం వంటి స్ట్రాటజీలను విశ్లేషిస్తోంది. హిందుస్థాన్ యూనిలీవర్ ఐస్క్రీమ్ సేల్స్లో క్విక్ కామర్స్ వాటా 10 శాతం ఉంది. ఈ కంపెనీ క్వాలిటీ వాల్స్, మాగ్నం, కార్నెట్టో వంటి బ్రాండ్లతో ఐస్ క్రీమ్ను అమ్ముతోంది. అమెరికన్ కంపెనీ బాస్కిన్ రాబిన్స్ ఇండియాలో తమ
1,000 వ స్టోర్ను ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది. ఈ ఏడాది సమ్మర్లో ఇండస్ట్రీ అంచనాల కంటే ఎక్కువ గ్రోత్ నమోదు చేస్తామని ఈ బ్రాండ్తో ఇండియాలో ఐస్క్రీమ్ అమ్ముతున్న గ్రావిస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. పాల ధరలు నిలకడగా ఉన్నాయని, టెంపరేచర్స్ పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసిందని తెలిపింది.