హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీలో బుధవారం నుంచి జనవరి 1 వరకు డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసు అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.
‘‘డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ సిటీలోని 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడ్తాం. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నం. న్యూ ఇయర్ వేడుకల జోష్లో మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వెహికల్ సీజ్తో పాటు రూ.10 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్షపడే అవకాశం ఉంటది’’అని సజ్జనార్ హెచ్చరించారు.
రోడ్లపై యువత రేసింగ్లు, వీలింగ్లు, ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్లు, క్లబ్లు, ఈవెంట్లు, పబ్లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందన్నారు. వైన్ షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు.
మహిళల భద్రత కోసం రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ తో నిఘా ఉంచుతాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు సీపీ (క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు, డీసీపీల శ్వేత, రక్షితా మూర్తి, రూపేశ్, తదితరులు పాల్గొన్నారు.
