
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత వడెత్తివార్
నాగపూర్: దేవాలయాల్లో హుండీలను తొలగిస్తే.. పూజారులు ఆలయాలను విడిచి వెళ్లిపోతారంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెత్తివార్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి. మహారాష్ట్రలోని పర్భనిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్లు చేయగా.. వాటిపై వచ్చిన ప్రశ్నలపై ఆయన సోమవారం ప్రెస్మీట్లో స్పందించారు. తాను చేసిన కామెంట్లకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కుల, మతాల మధ్య కలహాలు పెంచుతున్న పరిస్థితి ఉందన్నారు.
గొడవలు సృస్టించేందుకు మతాలను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో ఈ పరిస్థితులు లేవని చెప్పారు. దేశంలో శాంతి, శ్రేయస్సుకు అంబేద్కర్ లాంటి వాళ్లు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఒకవేళ అంబేద్కర్ బౌద్ధ మతం కాకుండా ఇస్లాం మతం స్వీకరించి ఉంటే.. కొందరు ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసేవారని అభిప్రాయపడ్డారు. గతంలో సాహితీవేత్తలు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టు విజయ్ వడెత్తివార్ గుర్తు చేశారు.