- కృష్ణా జలాల వాటాలో రాష్ట్రానికి కేసీఆర్ ద్రోహం చేశారని ఫైర్
- ప్రజల సొమ్మును దోచుకుని వేల కోట్లు సంపాదించారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్.. నీ కొడుకు కేటీఆర్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా? ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎంపీ లక్ష్మణ్తో కలిసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదీ జలాల వాటాలో సీఎం కేసీఆర్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. నాటి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణకు రావాల్సిన నీటి వాటా అడ్డుకున్న ద్రోహి అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ తొమ్మిదేండ్లుగా నాన్చడం, ఏపీతో కుమ్మక్కు కావడం వల్లే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. రాష్ట్రానికి పసుపు బోర్డు, సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీ ఏర్పాటుతో పాటు కృష్ణా ట్రిబ్యునల్కు విధివిధానాలు ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కృష్ణా జలాల వాటా, వివాదాలు పరిష్కారం కాబోతున్నాయని, దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అయ్యే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్మును దోచుకొని రూ.వేల కోట్లు ఎలా సంపాదించావో తెలియదనుకుంటున్నావా అని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ను ఏం చేశారు.. కనపడట్లే..
సీఎం కేసీఆర్ బయట కనబడక నెల రోజులవుతుందని, తమ గురువును ఏం చేశారని సంజయ్ ప్రశ్నించారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నాక కూడా కేసీఆర్ బయటకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. కేసీఆర్ యాడున్నడో.. ఏం చేస్తున్నడో కనీసం ఆయన చానల్ అయినా ఎందుకు చూపించడం లేదన్నారు. “కేసీఆర్కు ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం ఇష్టం లేదా? దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కావడం నచ్చదా? అక్కడి ప్రజలు వలసలు పోవాలని, ఆ ప్రాంతం ఏడారిగా మారాలని ఆయన కోరుకుంటున్నారా? ”అని ప్రశ్నించారు. కేసీఆర్కు మందు గోళీలు ఇచ్చే సడ్డకుడి కొడుకును ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లగొట్టాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకొస్తే.. తెలంగాణ పరిస్థితి శ్రీలంక మాదిరిగా మారుతుందని హెచ్చరించారు. మెడ మీద తలకాయ ఉన్నోళ్లెవ్వరూ ఆ పార్టీకి ఓటు వేయ్యరన్నారు. రాష్ట్రానికి శ్రీలంక పరిస్థితి రాకూడదనుకుంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని సంజయ్ కోరారు.
మోదీ సభలు ట్రైలర్ మాత్రమే: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణలో మోదీ రెండు సభలు ట్రైలర్ మా త్రమేనని, అసలు సినిమా ముందుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ ఎలాగూ మళ్లీ సీఎం అయ్యే పరిస్థితి లేదనే అక్కసుతో తెలంగాణలో బావబామ్మర్దులు కేటీఆర్, హరీశ్ రావు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ సంస్కారహీనంగా ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలతో అంటకాగిన బీఆర్ఎస్.. బీజేపీని విమర్శించడం సిగ్గుచేటన్నారు.