బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా వచ్చిందా? ట్రీట్మెంట్ ఖర్చులు భరించలేకపోతున్నారా? తక్కువ వడ్డీకే లోన్లను ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. కరోనా పాజిటివ్ రిపోర్ట్ ఉంటే లోన్ ఇస్తామని చెబుతున్నాయి. ఎటువంటి కొలేటరల్ తీసుకోకుండానే శాలరీడ్, నాన్ శాలరీడ్ కస్టమర్లకు లోన్లను ఇస్తున్నాయి. పెన్షనర్లకు కూడా లోన్ను ఆఫర్ చేస్తున్నాయి. కనీసం రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ఇస్తుండగా, తిరిగిచెల్లించడానికి ఐదేళ్ల వరకు టైమ్ ఇస్తున్నాయి. కరోనా ట్రీట్మెంట్ కోసం ఇస్తున్న లోన్లపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్ క్లోజర్ ఛార్జ్ (ముందే అప్పు తీర్చేస్తే విధించే ఛార్జీ) వంటివి వసూలు చేయడం లేదు. కొన్ని బ్యాంకులు మూడు నుంచి ఆరు నెలల వరకు లోన్ మారటోరియాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. వడ్డీ రేటు 6.85 శాతం నుంచి అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు తమ కోసం లేదా ఫ్యామిలీ మెంబర్ల కోసం ఈ లోన్లను పొందొచ్చు.
అర్హత..
స్టేట్ బ్యాంక్, పీఎన్బీ, బీఓబీ, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ బ్యాంకులు ఈ కోవిడ్ లోన్ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకుల నుంచి కరోనా లోన్ పొందాలంటే కామన్గా కొన్ని అర్హతలు ఉండాలి. అవి గత 12 నెలల్లో బ్యాంకు అకౌంట్ నుంచే శాలరీని తీస్తుండాలి. బ్యాంకులో ఇప్పటికే రిటైల్ లోన్ తీసుకున్న కస్టమర్లు కూడా కరోనా లోన్ను తీసుకోవడానికి అర్హులే. నాన్ శాలరీడ్ కస్టమర్లయితే బ్యాంక్ వద్ద సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి కస్టమర్లు రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను ఫైల్ చేసి ఉండాలి.
కరోనా లోన్ను ఆఫర్ చేస్తున్న బ్యాంకుల వివరాలు..
- స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా: కవచ్ పేరుతో కరోనా లోన్ను స్టేట్ బ్యాంక్ తెచ్చింది. లోన్ అమౌంట్ రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ఇస్తారు. బ్రాంచ్కు వెళ్లి ఈ లోన్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎస్బీఐలో లోన్ ఉంటే, ఆ లోన్కు అదనంగా ఈ కోవిడ్ లోన్ను పొందొచ్చు. లోన్పై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ, ప్రీ పేమెంట్ పెనాల్టీ, ఫోర్ క్లోజర్ ఛార్జీలు లేవు. కరోనా పాజిటివ్ రిపోర్ట్ కచ్చితంగా ఉండాలి. రిపోర్ట్ తీసుకొని 30 రోజులు దాట కూడదు. వడ్డీ రేటు 8.5 శాతం.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ): కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ‘పీఎన్బీ సహయోగ్ రిన్ కోవిడ్’ పేరుతో ఓ లోన్ స్కీమ్ను పీఎన్బీ తీసుకొచ్చింది. బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉండి, గత 12 నెలల నుంచి శాలరీని తీస్తున్న కస్టమర్లు మాత్రమే కోవిడ్ లోన్కు అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అర్హులు. వడ్డీ రేటు 8.5 శాతం. గత ఆరు నెలల సగటు శాలరీకి ఆరు రెట్ల అమౌంట్ను లోన్గా ఇస్తారు. గరిష్టంగా రూ. 3 లక్షలు ఇస్తారు.
- బ్యాంక్ ఆఫ్ బరోడా: బ్యాంక్ నుంచి ముందే లోన్ తీసుకున్న కస్టమర్లకు కోవిడ్ లోన్ను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఆఫర్ చేస్తోంది. గత ఆరు నెలల నుంచి బీఓబీలో అకౌంట్ ఉండాలి. లేదా గత మూడు నెలల నుంచి బ్యాంకులో ఇన్స్టాల్మెంట్స్ కడుతున్న కస్టమర్లు కూడా అర్హులే. నెల వారీగా వడ్డీరేటు విధిస్తుంది. వడ్డీ రేటు ‘బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటు’ + ఎస్పీ + ఏడాదికి 2.75 శాతం.
- బ్యాంక్ ఆఫ్ ఇండియా: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పటికే పర్సనల్ లేదా హౌసింగ్ లోన్ తీసుకున్న కస్టమర్లు ఈ కోవిడ్ లోన్కు అర్హులు. వడ్డీ రేటు రూ. 6.85 శాతం కాగా, అప్పును మూడేళ్లలో తిరిగి చెల్లించొచ్చు. అంతేకాకుండా ఆరు నెలల మారటోరియం ఇస్తోంది.