
ఏటా రూల్స్ తప్పుతున్న కాలేజీలు
మే నెలాఖరుకు అఫిలియేషన్లు పూర్తి
ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు సెక్రటరీ
నోటీసులతోనే సరిపెడుతున్న ఇంటర్ బోర్డ్
ఫైర్ ఎన్వోసీ లేని 83 ప్రైవేట్ కాలేజీలు
చర్యలకు వెనకాడుతున్న బోర్డు
ఈ ఏడాది జూనియర్ కాలేజీల అఫిలియేషన్లపై సీరియస్గా ఉన్నాం. గుర్తింపు ప్రక్రియను త్వరలోనే ప్రారంభించి, మే ఆఖరుకు పూర్తి చేస్తం. వచ్చే ఏడాదికి సంబంధించి ఏ కాలేజీకి గుర్తింపు ఇవ్వలేదు. కాబట్టి స్టూడెంట్స్ఎవ్వరూ కాలేజీల్లో చేరొద్దు. ఫైర్ ఎన్వోసీ లేని కాలేజీలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై గురువారం మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
హైదరాబాద్, వెలుగు: రూల్స్ను పాటించని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలకు వెనకాడుతోంది. ఏటా అకడమిక్ ఇయర్ మొదట్లో నోటీసులు ఇవ్వడం, కాలేజీలు తీరు మార్చుకోకపోతే స్టూడెంట్స్కు కండిషనల్ లాగిన్స్ ఇవ్వడం పరిపాటి అయింది. నాలుగైదేండ్లుగా ఈ తంతు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకవడంపైనా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్నీ ఆ కాలేజీలే..
రాష్ర్టంలో ఈ విద్యాసంవత్సరం 2,786 జూనియర్ కాలేజీలు రిజిస్టర్ చేసుకున్నాయి. వీటిలో 2,570 కాలేజీలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. వీటిలో ప్రైవేటు జూనియర్ కాలేజీలు1,701 రిజిస్టర్ చేసుకుంటే, 1,486 కాలేజీలకు గుర్తింపు ఉంది. మరో 215 కాలేజీలకు గుర్తింపులేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫైర్ఎన్వోసీ లేని కాలేజీలకు గుర్తింపు ఇవ్వొద్దని విద్యాశాఖకు గతంలో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటిని పట్టించుకోకుండా నాలుగేండ్లుగా బోర్డు అనుమతులిస్తూ పోతోంది. ఈ ఏడాదీ ఫైర్ఎన్వోసీ లేకుండా 83 కాలేజీలు కొనసాగుతున్నాయి. ఆ కాలేజీలన్నీ శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి, ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్లవే కావడం గమనార్హం. పరీక్షల టైం కావడంతో ఈ ఏడాదీ ఆయా కాలేజీల స్టూడెంట్స్కు కండిషన్ లాగిన్ ఇస్తూ పరీక్షలకు అనుమతిస్తున్నట్టు బోర్డు అధికారులు ప్రకటించారు. గుర్తింపులేని శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో అడ్మిషన్లపై రెండు రోజుల క్రితం హైకోర్టు సీరియస్ కావడంతో అఫిలియేషన్ల విషయం మరోసారి తెరమీదకు వచ్చింది.
కాలేజీలు స్టార్ట్ అయ్యాకే
జూన్1న నాటికి కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వాలి. గుర్తింపులేని కాలేజీల లిస్టు ప్రకటించాలి. కానీ వాటిని ఇంటర్ బోర్డు అధికారులు పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరు నాటికి 348 ప్రైవేటు కాలేజీలకే షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. డిసెంబర్ వరకూ ఈ అఫిలియేషన్ల ప్రక్రియ కొనసాగింది. ప్రస్తుతం 1,486 కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఫైర్ఎన్వోసీ లేకపోవడంతో 83 కాలేజీలకు మాత్రం ఇవ్వలేదంటున్నారు. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు70 వరకూ ఉన్నాయి. నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ కొన్ని ఉన్నాయి. అయితే లెక్చరర్లు, పీడీలు, లైబ్రేరియన్లు, శానిటేషన్ సర్టిఫికెట్, ల్యాండ్ పత్రాలు లేని కాలేజీలకూ ఈ సారి అధికారులు అనుమతులిచ్చారు.