
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) కరోనా విరుగుడును తక్కువ ఖర్చులో తయారు చేసే సింథటిక్ పద్ధతి కనుగొంది. కరోనాపై పోరాడే 25 మందులను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ గుర్తించింది. ఒకటి ఫావిపిరావిర్. దీన్ని ఫ్యూజిఫిల్మ్ తోయామా కెమికల్ లిమిటెడ్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ (ఏపీఐ). ఆ ‘ఫార్ములా’నే ఐఐసీటీ కనుగొంది. తయారీకి దేశీ ఫార్మా కంపెనీ సిప్లాతో ఒప్పందం చేసుకుంది. డెవలప్ చేశాక క్లినికల్ ట్రయల్స్ చేయనుంది సిప్లా కంపెనీ. ‘సిప్లెంజా’ పేరిట మార్కెట్ చేయనుంది. ఆ మందు తయారీ, క్లినికల్ ట్రయల్స్పై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సిప్లా దరఖాస్తు చేసుకున్నట్టు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలిపింది. ఫావిపిరావిర్ను ఇన్ఫ్లుయెంజా వంటి వాటికి వాడుతున్నారని చెప్పింది. అన్ని అనుమతులు వచ్చాక ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కంపెనీ ట్రయల్స్ చేస్తుందని ప్రకటించింది. చైనా, జపాన్, ఇటలీ దేశాల్లో దీన్ని టెస్ట్ చేస్తున్నారని చెప్పింది. ట్రయల్స్ సక్సెస్ అయితే ఆరు నెలల్లో మందు అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఫావిపిరావిర్ను టెస్ట్ చేసేందుకు డీసీజీఐ అనుమతిచ్చిందని మరో ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ వెల్లడించింది. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ లిమిటెడ్ కూడా ఫావిపిరావిర్ టాబ్లెట్లు తయారు చేశామని, ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి కోరామని తెలిపింది.