
- రాత్రి వేళల ఆంధ్రా నుంచి ఇసుక అక్రమ రవాణా
- అక్రమార్కులకు సహకరిస్తున్న కొందరు పోలీసులు
- ఇప్పటికే ఏడుగురిపై వేటు
- మరి కొందరిపై చర్యలకు రంగం సిద్ధం
సూర్యాపేట, వెలుగు : ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాత్రి వేళలో ఇసుకను లారీల్లో తెలంగాణకు తరలిస్తున్నారు. బార్డర్ చెక్ పోస్టుకు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా సాగుతోంది. ఈ అక్రమ రవాణాకు కొందరు పోలీసులు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ సరిహద్దు రామాపురం చెక్ పోస్టు వద్ద ఇసుక లారీలను పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గుట్టుచప్పుడు కాకుండా ఇసుక సరఫరా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ చెందిన టీడీపీ నాయకులు కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం దొండపాడు మీదుగా కోదాడ బైపాస్ చేరుకొని అక్కడి నుంచి నేషనల్ హైవే మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రతిరోజూ 16 లారీల్లో ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. భద్రాచలం నుంచి కోదాడకు ఇసుక తీసుకొస్తున్నట్లు బిల్లులు చూపిస్తూ కీసర, లింగాల జగ్గయ్యపేటలో డంప్ చేస్తారు. అక్కడి నుంచి రాత్రి వేళల్లో లారీలో లోడింగ్ చేసుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
దందాలో కొందరు పోలీసుల పాత్ర..
జిల్లాలోని కొంతమంది పోలీసులు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక తరలించే సమయంలో పోలీస్ సిబ్బందిని ఎస్కార్ట్ గా పంపిస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో లారీకి రూ.3 వేల చొప్పున పోలీసులకు ముడుపులు అందుతున్నట్లు సమాచారం. కొంతకాలంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవల సీపీఎస్, పోలీసులు కలిసి మూడు ఇసుక లారీలను పట్టుకున్నారు. లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకొని కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
పోలీసులపై వేటు..
ఇటీవల అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. అనంతరం సీసీఎస్ పోలీసులు ఎంక్వైరీ చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సహకారంతోనే హైదరాబాద్ కు ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు సీసీఎస్పోలీసులు గుర్తించారు. అక్రమార్కులకు సహకరిస్తున్న పోలీసులను గుర్తించి ఎస్పీకి రిపోర్ట్ అందించారు. ప్రతిరోజు ఒక్కో లారీకి రూ.3 వేల చొప్పున 16 లారీలకు రూ.48 వేలు మామూళ్లు తీసుకోవడంతోపాటు ఏకంగా లారీలకు పోలీసులు ఎస్కార్ట్ పంపిస్తున్నట్లు గుర్తించారు. కోదాడ రూరల్ సీఐ సైతం పోలీస్ సిబ్బంది అవినీతిపై రిపోర్ట్ అందించారు. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు, చిలుకూరు పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ పై బదిలీ వేటు పడింది. సీసీఎస్ పోలీసుల రిపోర్ట్ ఆధారంగా మరి కొంతమంది సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
చర్యలు తీసుకుంటాం
ఆంధ్రా నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో నిఘా పెట్టి లారీలను పట్టుకున్నాం. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు. ఇందుకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటాం.
నరసింహ, ఎస్పీ, సూర్యాపేట