న్యూఢిల్లీ: దేశంలో గత 30 ఏళ్లలో సగటున ఏడాదికి ఒక షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ మూతపడింది. ఏవియేషన్ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు మొదటిసారి అడుగు పెట్టింది సుమారు 30 ఏళ్ల కిందటే. వాడియా గ్రూప్ నాయకత్వంలోని గో ఫస్ట్ ఎయిర్లైన్స్ తాజాగా ఈ జాబితాలోకి చేరింది. నవంబర్ 1996లో ఈస్ట్వెస్ట్ ట్రావెల్స్ అండ్ ట్రేడ్ లింక్ లిమిటెడ్ మూతపడింది. ఈ కంపెనీ అప్పటికి కార్యకలాపాలు మొదలుపెట్టి కేవలం రెండేళ్లయింది. 1996 లోనే మరో ఎయిర్లైన్స్ సంస్థ మోడిలుఫ్ట్ లిమిటెడ్ కూడా కనుమరుగయింది. 1994 లో మొదటిసారిగా ప్రైవేట్ ఎయిర్లైన్స్ మన దేశంలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. అప్పటి నుంచి చూస్తే కనీసం 27 షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ కంపెనీలు మూతపడటమో లేదా చేతులు మారడమో జరిగింది. కరోనా మహమ్మారి నుంచి బయపడిన తర్వాత దేశంలోని ఎయిర్లైన్స్సెక్టార్ ఇటీవలే జోరందుకుంది. ప్రాట్అండ్ విట్నీ ఇంజిన్లు అందుబాటులో లేకపోవడంతో ఆర్థికంగా కష్టాలలో కూరుకుపోయిన గో ఫస్ట్ చేతులెత్తేసింది. ఇంజిన్లు లేక తనకున్న విమానాలలో సగానికి పైగా విమానాలను నేలకే పరిమితం చేసింది. దీంతో ఆపరేషన్స్ నిర్వహణ ఆ కంపెనీకి కష్టంగా మారింది.
2020లో మూడు కంపెనీలు..
జూమ్ ఎయిర్ పేరుతో సేవలు అందించిన జెక్సస్ ఎయిర్ సర్వీసెస్, డెక్కన్ చార్టర్డ్ , ఒడిషా ఏవియేషన్ కంపెనీలు 2020 లో కార్యకలాపాలు నిలిపివేశాయి. 2022లో మరో కంపెనీ హెరిటేజ్ ఏవియేషన్ విమానాలు ఎగరడం నిలిచిపోయింది. దేశంలో ఫుల్ సర్వీస్ క్యారియర్గా పేరొందడమే కాకుండా, ఒక పెద్ద ఆపరేటర్గా మారిన తర్వాత జెట్ ఎయిర్వేస్ లిమిటెడ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ కంపెనీ ఆర్థిక కష్టాలతో 2019 లోనే ఆపరేషన్స్ నిలిపివేసింది. ఈ కంపెనీని వేరొక కన్సార్టియమ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్లో కొనుగోలు చేసింది. అయినా ఇంకా కార్యకలాపాలు మొదలుపెట్టలేదు. జెట్లైట్(అంతకు ముందు పేరు సహారా ఎయిర్లైన్స్) కూడా 2019 లోనే నిలిచిపోయింది. విలాసవంతమైన ఎంట్రప్రెనార్గా పేరొందిన విజయ్మల్యా నడిపిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా 2012 లో మూతపడింది. దీనికంటే ముందు, 2008 లో ఎయిర్దక్కన్ పేరుతో సేవలందించిన దక్కన్ ఏవియేషన్ కంపెనీని కింగ్ఫిషర్ కొనేసింది. దేశంలో లో కాస్ట్ ఎయిర్ ట్రావెల్ను అందుబాటులోకి తెచ్చిన మొదటి కంపెనీ దక్కన్ ఏవియేషనే కావడం విశేషం.
2017లో ఏకంగా 5 ఎయిర్లైన్స్
2017 సంవత్సరంలోనైతే ఏకంగా 5 ఎయిర్లైన్స్ కంపెనీలు చేతులెత్తేశాయి. ఎయిర్కార్నివాల్, ఎయిర్ పెగాసస్, రెలిగేర్ ఏవియేషన్, ఎయిర్ కోస్టా, క్విక్జెట్ కార్గో ఎయిర్లైన్స్ కంపెనీలు ఆ ఏడాదిలో మూతపడ్డాయి. దక్కన్ కార్గో అండ్ ఎక్స్ప్రెస్లాజిస్టిక్స్ 2014 లోను, ఆర్యన్ కార్గో ఎక్స్ప్రెస్ 2011 లోను, పారమౌంట్ ఎయిర్వేస్ 2007 లోను, ఎండీఎల్ఆర్ ఎయిర్లైన్స్ 2009 లోను, జాగ్సన్ ఎయిర్లైన్స్ 2008 లోను, ఇండస్ ఎయిర్వేస్ 2007 లోను తమ తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. ఎన్ఈపీసీ మైకాన్, స్కైలైన్ ఎన్ఈపీసీ (దమానియా ఎయిర్వేస్) కంపెనీలు 1996, 1997 సంవత్సరాలలో మూతపడ్డాయి. అధికారిక డేటా ప్రకారం లుఫ్తాన్సా కార్గో 2000 సంవత్సరంలో తన కార్యకలాపాలు నిలిపివేసింది. ఏవియేషన్ మార్కెట్ వేగంగా ఎదుగుతున్న దేశాలలో ఇండియా ముందు వరసలో నిలుస్తోంది. ఏటేటా విమాన ప్రయాణికుల సంఖ్య దేశంలో భారీగా పెరుగుతోంది. దేశంలో ఇప్పుడు నడుస్తున్న ఎయిర్లైన్స్ కంపెనీలలో ఒక్క అలయన్స్ ఎయిర్ను మినహాయిస్తే మిగిలినవన్నీ ప్రైవేటు కంపెనీలే.
17 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గో ఫస్ట్ వాలంటరీగా ఇన్సాల్వెన్సీ కోసం పిటిషన్ ఫైల్ చేసుకుంది. ఈ పిటిషన్ను ఎన్సీఎల్టీ గురువారం విచారించనుంది. జెట్ఎయిర్వేస్ తర్వాత ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ కిందకి వచ్చిన రెండో కంపెనీ ఇదే. ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్లో జెట్ఎయిర్వేస్ను జలన్ కల్రాక్ కన్సార్టియమ్ చేజిక్కించుకుంది. కానీ, ఓనర్షిప్ ఇంకా బదిలీ కాకపోవడంతో ఆపరేషన్స్ మొదలవలేదు. ఓనర్షిప్ బదిలీకి సంబంధించి జెట్ఎయిర్వేస్ రుణదాతలు, కొత్త కొనుగోలుదారుల మధ్య వివాదం నడుస్తోంది.