ఆదిలాబాద్ లో బరితెగిస్తున్న ఇసుక మాఫియా

ఆదిలాబాద్ లో బరితెగిస్తున్న ఇసుక మాఫియా
  •  
  • ఆదిలాబాద్​ జిల్లాలో టీఆర్​ఎస్​ లీడర్ల బరితెగింపు
  • వీడీసీల మాటున ఆగడాలు
  • పెన్​గంగా వెంట అక్రమ క్వారీలు
  • జైనథ్ మండలం  సాంగ్విలో నీళ్లకు అడ్డుకట్ట వేసి తవ్వకాలు

ఆదిలాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. ఆదిలాబాద్  జిల్లాలో ఏకంగా నది నీళ్లనే మరో దిక్కు మళ్లించి ఇసుకను ఎత్తుకుపోతున్నది. జైనథ్ మండలం సాంగ్విలోని పెన్​గంగ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి.. తవ్వకాలు చేపడుతున్నది. ఈ జిల్లాలో తాంసి మండలం మొదలుకొని బేల మండలం వరకు ప్రవహించే పెన్​గంగా వెంట దాదాపు అన్ని తీర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా పెన్​గంగాలో ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని మైనింగ్​శాఖ ఇచ్చిన నివేదిక మేరకు క్వారీలకు సర్కారు అనుమతి ఇవ్వలేదు. కానీ గత జనవరిలోనే పలు గ్రామాల్లో విలేజ్​ డెవలప్​​మెంట్​ కమిటీ(వీడీసీ)ల పేరుతో టీఆర్​ఎస్​ లీడర్లు ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచారు. వ్యాపారుల ముసుగులో క్వారీలు దక్కించుకున్న ఆ లీడర్లు నదిలో నీటిని మళ్లిస్తూ వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. వానలు పడే లోగా వీలైనంత ఎక్కువ ఇసుకను దోచుకోవాలనే ఉద్దేశంతో సాంగ్వి గ్రామం వద్ద నదిలో నీటిని మళ్లించి  దందా నడిపిస్తున్నారు. 

ఆదిలాబాద్​జిల్లాలో ఫారెస్ట్​ ల్యాండ్స్ ఎక్కువగా ఉండడం, నదుల్లో సరిపడా ఎత్తులో ఇసుక నిల్వలు లేకపోవడంతో అటు అటవీ శాఖ, ఇటు మైనింగ్​శాఖ సాండ్​ రీచ్​లకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇదే అదనుగా జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ముఖ్యంగా అధికార పార్టీ లీడర్ల ఆధ్వర్యంలో పెన్​గంగా వెంట తాంసి, తలమడుగు, భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగుతున్నాయి. అఫీషియల్​ రీచ్​లకు పర్మిషన్​ లేకపోవడంతో లీడర్లు ఆయా గ్రామాల్లో వీడీసీలను అడ్డుపెట్టుకొని దందా సాగిస్తున్నారు. నది వెంట డోల్హార, పెండల్ వాడ, కౌఠ, సాంగ్వి, ఆనంద్​పూర్​, సాంగ్డి గ్రామాల పరిధిలో భారీ ఇసుక క్వారీలు ఏర్పాటు చేశారు. ఈ ఆరు క్వారీల్లో  మూడు నెలలుగా అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతూ రోజూ 500కు పైగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కూలీలతో పాటు జేసీబీలతో ఇసుక తవ్వకాలు చేపట్టి, ముందుగా పక్కనే ఉన్న పంట పొలాల్లో డంప్​ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆదిలాబాద్​ టౌన్​తో పాటు జిల్లాలోని దాదాపు అన్ని ఏరియాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం వీడీసీలు తమ పరిధి దాటి టెండర్లు నిర్వహిస్తున్నాయి. గత జనవరిలోనే వేలం పాటలు నిర్వహించగా ఆరు నెలల కాలానికి జైనథ్ మండలంలోని డోల్హారా క్వారీని రూ.  45 లక్షలకు, సాంగ్వి క్వారీని రూ. 28 లక్షలకు, ఆనంద్​పూర్​ క్వారీని రూ. 20 లక్షలకు, బేల మండలంలోని సాంగ్డి గ్రామ క్వారీని రూ. 60 లక్షలకు లీడర్లు దక్కించుకున్నారు.  

ఇట్లా మళ్లించిన్రు

జైనథ్ మండలం గ్విలోని ఇసుక క్వారీని జనవరిలో మారు రూ.28 లక్షలకు దక్కించుకున్న లీడర్లు ఫిబ్రవరి చివరి కల్లా పెన్​ గంగా  ప్రవాహం తగ్గుతుందని భావించారు. కానీ ప్రవాహం తగ్గకపోవడంతో ఆలోచనలో పడ్డారు. వర్షాలు పడేలోగా ఎట్లయినా అక్కడి ఇసుకను ఖాళీ చేయాలంటే నది నీటికి అడ్డుగా కట్టవేయడం ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చారు. వీడీసీ కూడా సహకరించడంతో వారం పాటు శ్రమించి మట్టి, రాళ్లు, ఇసుకతో అడ్డుకట్ట వేసి నీటికి మలిపారు. దీంతో ఊరివైపు ఇసుక తిన్నెలు తేలడంతో రాత్రింబవళ్లు ఇసుకను తవ్వి, తరలిస్తున్నారు. నిజానికి నదిలో ఎక్కడైనా భూమి నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు ఇసుక నిల్వలు ఉంటే తప్ప అనుమతులు ఇవ్వరు. ఒకవేళ అలాంటి చోట్ల ఇసుక తవ్వకాలు చేపడితే చాలా నష్టం ఉంటుందని ఆఫీసర్లు అంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వరద ముప్పు ఉంటుందని చెప్తున్నారు. ఇక నదిలో అడ్డుకట్టలు, ఇసుక రవాణా కోసం రోడ్లు వేసి టైమ్​కు  తీసేయకపోవడం వల్ల నదికి ఇరువైపులా గట్లు కోతలకు గురవుతాయని హెచ్చరిస్తున్నారు. కానీ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ లీడర్లు, వాళ్లకు సహకరిస్తున్న వీడీసీలకు నిబంధనలు పట్టడం లేదు. చాలాచోట్ల మీటర్​ ఎత్తుకూడా ఇసుక లేని పెన్​గంగాను ఇష్టమొచ్చినట్లుగా తవ్వుతుండడం వల్ల భవిష్యత్​లో అనేక సమస్యలు వస్తాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

రోజూ 5‌00 ట్రిప్పులు..సీజన్​లో 50 కోట్ల దందా

పెన్​గంగా  నది పొడవునా దాదాపు అన్ని గ్రామాల్లో అక్రమంగా ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. ఆరు ప్రధాన క్వారీల నుంచి తక్కువలో తక్కువ 500 ట్రిప్పుల ఇసుకను ప్రతిరోజూ తవ్వి తరలిస్తున్నారు. ట్రిప్పునకు రూ. 3,500 చొప్పున ఆరు నెలల కాలానికి (జనవరి నుంచి జూన్​ వరకు) రూ. 30 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. మిగిలిన చిన్నాచితకా క్వారీలను కూడా కలిపితే ఈ సీజన్​లో ఇసుక అక్రమ రవాణా రూ. 50 కోట్లను దాటుతుంది. ఈ దందా వెనుక అధికార పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు మొదలుకొని మండల, నియోజకవర్గ స్థాయి లీడర్లు ఉండడంతో వీళ్లపై చర్యలకు ఫారెస్ట్​, మైనింగ్, రెవెన్యూ​ ఆఫీసర్లు, పోలీసులు వెనుకాడుతున్నారు. తప్పిదారి ఎక్కడైనా ఇసుక ట్రాక్టర్​ను పట్టుకుంటే నిమిషాల వ్యవధిలో పైనుంచి ఫోన్లు వస్తుండడంతో ఆఫీసర్లు, పోలీసులు వదిలేస్తున్నారు. కొన్నిసార్లు తూతూమంత్రంగా ఫైన్లు వేసి విడిచిపెడుతున్నారు. 

ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు

పెన్ గంగాలో ఇసుక తవ్వకాల కోసం ఎవరికీ, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ నదిలో ఇసుక లభ్యత తగినంత లేదని, ఇలాంటి చోట్ల ఇసుక తవ్వకాలు కరెక్ట్​ కాదని గతంలోనే సర్వే చేసి సర్కారుకు రిపోర్టు అందజేశాం. దీంతో ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్ లకు అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్​ లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 
- రవి శంకర్, మైనింగ్ ఏడీ
అనుమతులు లేకుండా తవ్వుతున్నరు
పెన్​గంగా వెంట ఇసుక తవ్వకాలకు అధికారికంగా ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా గ్రామా సంఘాలు, వీడీసీల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నదిలో ఇసుక సరిపడా లేదని గతంలో ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. అందుకే ఇసుక రీచ్​లకు పర్మిషన్​ ఇవ్వలేదు. అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా ఉంటాం. 
- రాజేశ్వర్, ఆర్డీవో, ఆదిలాబాద్