
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 70 లక్షల మంది యాక్టివ్ సబ్స్క్రయిబర్లను టెల్కోలు పోగొట్టుకున్నాయి. గత పది నెలల్లో చూస్తే ఇంత మంది కస్టమర్లను పోగొట్టుకోవడం ఇదే మొదటిసారి. చాలా మంది యూజర్లు రెండో సిమ్ను వాడకపోవడం వల్లే ఇలా జరిగిందని ఎనలిస్టులు చెబుతున్నారు. భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా (వీ) కంపెనీలు మూడూ ఏప్రిల్ నెలలో సబ్స్క్రయిబర్లను పోగొట్టుకోవడం విశేషం. ఒక్క ఏప్రిల్ 2020లో లాక్డౌన్ టైమును మినహాయిస్తే, గత పదేళ్లలో టెలికం కంపెనీలు ఇంత పెద్ద సంఖ్యలో కస్టమర్లను పోగొట్టుకోవడం ఇది రెండోసారి మాత్రమే. టారిఫ్లు పెరుగుతున్న నేపథ్యంలో సిమ్ కన్సాలిడేషన్కు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు జెఫ్రీస్ పేర్కొంది. జియో లక్ష మంది కస్టమర్లను కోల్పోగా, ఎయిర్టెల్ 31 లక్షల మంది, వీ 38 లక్షల మంది కస్టమర్లను నష్టపోయాయి.