చెప్పినా వినని సివిల్ సర్వెంట్లు.. రూ.1కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

చెప్పినా వినని సివిల్ సర్వెంట్లు.. రూ.1కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

కర్ణాటకలో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన ఇద్దరు సివిల్ సర్వెంట్ అధికారుల తతంగం ఇంకా సద్దుమణగలేదు. వారి పర్సనల్ ఫైట్ కాస్తా ప్రభుత్వం దగ్గరికి చేరడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను పోరాడుతున్నట్లు ఐపీఎస్ రూప మౌద్గిల్ తాజాగా పోస్టు పెట్టగా.. ఐఏఎస్ రోహిణీ సింధూరినేమో ఆమెకు లీగల్‌ నోటీసులు పంపారు. బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాదు పరువుకు భంగం కలిగించినందుకు, ఆరోపణలతో మానసిక వేదన కలిగించినందుకు రూ. కోటి పరిహారం చెల్లించాలని నోటీసుల్లో వెల్లడించారు.

ఈ విషయం తన స్నేహితులు, బంధువులకు తెలియడంతో గత కొద్ది రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్టు రోహిణీ ఆరోపించారు. అలాగే సింధూరిని ఉద్దేశించి చేసిన ఫేస్‌బుక్ పోస్టులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రూప ఫేస్ బుక్ లో చేసిన రచ్చ అనంతరం అధికారులు వీద్దరినీ బదిలీ చేసి, పోస్టింగులు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. దాంతో పాటు వీరు సోషల్ మీడియాలో ఎలాంటి ఆరోపణలు చేసుకోవద్దని, బహిరంగ ప్రకటనలు ఇవ్వొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినా రూపా మళ్లీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం గమనార్హం.