దేశంలో గడిచిన 28 రోజులుగా కొత్తగా కరోనా కేసులు నమోదు కాని జిల్లాల సంఖ్య 15కు చేరినట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్. అలాగే 14 రోజులుగా 80 జిల్లాల్లో కొత్త కేసులు లేవని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని జిల్లాల్లో వేగంగా కరోనా కేసుల సంఖ్య రెట్టింపవుతోందని, ఆ జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపైనా రాష్ట్రాలు శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇవాళ ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి అన్ని రాష్ట్రాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారని, ఈ సందర్భంగా ప్రజల్లో కరోనాపై అనవసర భయాలను తొలగించాలని కోరారని తెలిపారు. ప్లాస్మా థెరపీ బాగా పని చేస్తోందని, రెడ్ క్రాస్ సమకారంతో కోలుకున్న కరోనా పేషెంట్ల నుంచి రక్త సేకరణ చేపట్టాలని సూచించినట్లు చెప్పారు.
