- ఇండ్లు విడిచి పనుల బాట పట్టిన జనం
- నడిచిన ఆటోలు, ట్యాక్సీలు.. పలు సిటీల్లో ట్రాఫిక్ జామ్లు
- లిక్కర్ షాపుల వద్ద భారీ క్యూ లైన్లు.. సోషల్ డిస్టెన్స్ బేఖాతర్
- కార్టన్ల కొద్దీ మందు కొనుక్కుపోయిన కస్టమర్లు
న్యూఢిల్లీ: దేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షల నడుమ బతుకుబండి పట్టాలెక్కింది. సుమారు నెలన్నర రోజుల నుంచి ఇండ్లకే పరిమితమైన జనం పనుల బాటపడుతున్నారు. కంటెయిన్మెంట్ ఏరియాల్లో తప్ప దాదాపు అన్ని జోన్లలో సోమవారం చిన్న చిన్న షాపులు మొదలు ఆఫీసుల వరకు ఓపెన్ అయ్యాయి. ఒకవైపు కరోనా కట్టడికి లాక్డౌన్ను అమలు చేస్తూనే.. మరో వైపు ఎకానమీని గాడిలో పెట్టేందుకు జోన్ల వారీగా కేంద్రం ఇటీవల పెద్ద ఎత్తున సడలింపులను ఇచ్చింది. థర్డ్ ఫేజ్ లాక్డౌన్ ప్రారంభమైన సోమవారం నుంచే ఈ సడలింపులు అమలులోకి వచ్చాయి. వీటికి చాలా రాష్ట్రాలు ఓకే చెప్పడంతో కూలీలు, సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ లిక్కర్ షాపులు ఓపెన్ కావడంతో మద్యం ప్రియులు ఫుల్ జోష్తో కనిపించారు. ఉదయమే షాపుల ముందు క్యూ కట్టారు. గ్రీన్ జోన్లలో నెలన్నర కిందట ఉన్న వాతావరణమే కనిపించింది. దాదాపు అన్నిరకాల పనులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకే ఎసెన్షియల్తోపాటు నాన్ ఎసెన్షియల్ షాపులను కూడా తెరిచారు. ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ వర్క్స్, ఈ కామర్స్ సేవలు, కొరియర్, పోస్టల్ సర్వీసులు, బ్యాంకింగ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ యాక్టివిటీస్ కనిపించాయి. పనులకు వెళ్లే వాళ్లు మాస్కులు ధరిస్తూ.. సోషల్ డిస్టెన్స్ను పాటించడం కనిపించింది. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ తరహా రూల్స్ను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.
ఢిల్లీ, కేరళ, ఒడిశా, తమిళనాడు, బెంగాల్, ఏపీ, అరుణాచల్ప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో మెకానిక్ షాపులు, మొబైల్ షాపులు, ఎలక్ట్రికల్ షాపులు, ఆప్టికల్స్, స్టేషనరీ షాపులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, బ్యాంకులు తెరుచుకున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో 50 శాతం స్టాఫ్తో ఆఫీసులు, బ్యాంకులు కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఒడిశాలోని రెడ్జోన్లలోనూ 33% కెపాసిటీతో ప్రైవేటు ఆఫీసులను ఓపెన్ చేశారు. కొన్ని వారాలుగా పెండింగ్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ను పూర్తి చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు మేజర్బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. రెడ్ జోన్లలో తప్ప గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ట్యాక్సీలు, ఆటోలు నడిచాయి. జనం ఎక్కువగా సొంత వెహికల్స్ను ముఖ్యంగా బైక్లపై బయటకు రావడం కనిపించింది. ఢిల్లీ, ఈటానగర్, బెంగళూరు, అహ్మదాబాద్, కటక్ వంటి సిటీల్లో ఉదయం పూట జనం ఒక్కసారిగా బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం గ్రీన్జోన్లలో 50శాతం కెపాసిటీతో బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బార్బర్ షాపులు కూడా ఓపెన్ అయ్యాయి. అయితే కేరళలో మాత్రం బార్బర్ షాపులను ఓపెన్ చేయలేదు. గుజరాత్లోనూ సడలింపులు అమలులోకి వచ్చాయి.