డిప్యూటీ తహసీల్దార్​ చెంప చెల్లుమనిపించిన మహిళ

డిప్యూటీ తహసీల్దార్​ చెంప చెల్లుమనిపించిన మహిళ
  •     సైగలు చేస్తూ ఫొటోలు, 
  •     వీడియోలు తీస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు
  •     అబద్ధపు ఆరోపణలతో దాడి చేసిందని ప్రతిగా డీటీ కంప్లయింట్​
  •     సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో ఘటన 

నారాయణ్ ఖేడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఓ డిప్యూటీ తహసీల్దార్​మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో చెంప చెల్లుమనిపించింది. బాధితురాలి కథనం ప్రకారం...టౌన్​లోని సత్యసాయి కాలనీలో సాయి ఇంట్లో ఎలక్షన్స్ డిప్యూటీ తహసీల్దార్ రాజు ఆరు నెలల నుంచి అద్దెకు ఉంటున్నాడు. ఇతడి ఫ్లాట్​పక్కనే మరో ఆఫీసర్, అతడి భార్య కూడా రెంట్​కు ఉంటున్నారు. సదరు ఆఫీసర్​భార్యను కొంతకాలంగా రాజు వేధిస్తున్నాడు. ఆమెకు ఇష్టం లేకపోయినా మాట్లాడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లైంగికపరమైన సైగలు చేస్తూ, ఫోన్​లో ఫొటోలు, వీడియోలు తీస్తున్నాడు. బుధవారం రాత్రి కూడా ఫొటోలు తీయగా ఆమె వెళ్లి తన ఫొటోలు ఎందుకు తీశావని, ఫోన్​ చూపించమని అడిగింది. 

దీంతో తాను ఫొటోలు తీయలేదని, తన గ్యాలరీ బ్లాక్​అయ్యిందని సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహించిన ఆమె డిప్యూటీ తహసీల్దార్​చెంపపై కొట్టింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజు కూడా సదరు మహిళపై పోలీసులకు కంప్లయింట్​ఇచ్చాడు. గతంలో తన ఫ్లాట్​లో రూ.50 వేలు పోతే సదరు మహిళతో పాటు ఆమె భర్తను అడిగానని, ఆ ఘటనలో అప్పట్లోనే ఇద్దరూ తనపై దాడి చేశారని అందులో పేర్కొన్నాడు. పాత విషయాన్ని మనసులో పెట్టుకుని అబద్దపు ఆరోపణలు చేయడమే కాకుండా చేయి చేసుకున్నారని వాపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.