
గద్వాల, వెలుగు : స్కూల్ వ్యాన్ బోల్తా పడడంతో 20 మంది స్టూడెంట్లకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గట్టు మండల పరిధిలోని ఆరగిద్ద గ్రామంలో ఉన్న జ్ఞాన సరస్వతి స్కూల్ వ్యాన్ శుక్రవారం స్టూడెంట్లను ఎక్కించుకొని వెళ్తోంది.
ఈ క్రమంలో సల్కాపురం గ్రామ శివారులోకి రాగానే వ్యాన్ అదుపు తప్పి వ్యవసాయ పొలంలో పల్టీ కొట్టింది. దీంతో వ్యాన్లో ఉన్న 20 మంది స్టూడెంట్లు స్వల్పంగా గాయపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యాన్ నడిపిన డ్రైవర్తో పాటు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సల్కాపురం గ్రామానికి చెందిన బోయ మౌలాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లేశం తెలిపారు.