గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్సీఎల్)లో నిల్వ ఉన్న బూడిద తరలింపు మళ్లీ షురూ అవుతోంది. ఎన్టీపీసీలో టన్ను బూడిద రూ. 402 చొప్పున అమ్ముతుంటే ఆర్ఎఫ్ సీఎల్లో ఉన్న బూడిదను మాత్రం ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం నామినేషన్ పద్ధతిలో వర్క్ఆర్డర్ ఇవ్వగా ఇంకా కొంత బూడిద మిగిలి ఉందన్న కారణం చూపుతూ మరోసారి ఎక్స్టెన్షన్ తీసుకున్నారు.
ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) ఆధ్వర్యంలో బొగ్గు ఆధారితంగా రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ నిర్మించారు. 1980 నుంచి 1999 వరకు 19 సంవత్సరాలపాటు యూరియా ఉత్పత్తి చేశారు. ఆ సమయంలో బొగ్గును మండించడం ద్వారా వచ్చిన బూడిదను ఫ్యాక్టరీ ఆవరణలోని యాష్ పాండ్లలో నిల్వ చేశారు. నష్టాల కారణంగా 1999లో ఫ్యాక్టరీ మూసివేశారు. అనంతరం ఇదే ఫ్యాక్టరీ ఆవరణలో గ్యాస్ ఆధారంగా యూరియా ప్లాంట్ ఏర్పాటు చేశారు. అయితే పాత ఫ్యాక్టరీకి చెందిన బూడిదపై కన్నేసిన కొందరు ప్రజా అవసరాలు, ఇటుకల తయారీ, లోతట్టు ప్రాంతాలను లెవల్ చేసేందుకంటూ కాంట్రాక్ట్ ఫర్మ్గా ఏర్పడి 2016లో కేంద్రంలో ఉన్న అప్పటి ఆఫీసర్లను కలిశారు. వృథాగా ఉన్న బూడిదను తీసుకెళతామని విన్నవించారు. 2017 జనవరి నుంచి ఆరు నెలలపాటు 50 వేల క్యూబిక్ మీటర్ల బూడిదను తరలించేందుకు ఎలాంటి రుసుం తీసుకోకుండా నామినేషన్ పద్ధతిన అప్పటి ఎఫ్సీఐ మేనేజ్మెంట్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. అయితే ప్లాంట్లోని ఏదైనా సామగ్రి డ్యామేజ్ చేయడం, స్క్రాప్ ఎత్తుకెళ్లడం చేస్తారేమోననే ఉద్దేశంతో కాంట్రాక్టు సంస్థ నుంచి ఎఫ్సీఐ మేనేజ్మెంట్ రూ.10 లక్షలు కాషన్ డిపాజిట్ తీసుకుంది. ఆనాటి నుంచి కాంట్రాక్టు సంస్థ ఎఫ్సీఐ ప్లాంట్లోని బూడిదను లారీల ద్వారా తరలిస్తూ.. ఒక్కో లారీకి రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తోంది. సీజన్లో ఒక్కో లారీకి రూ.1,500 నుంచి రూ.రెండు వేల వరకు కూడా తీసుకుని సొమ్ము చేసుకున్నారు. ఇలా మధ్యమధ్యలో ఎఫ్సీఐకి కన్సల్టెంట్గా ఉన్న ఆఫీసర్ల సహకారంతో బూడిద తరలించే పనిని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. రూ.10 లక్షల కాషన్ డిపాజిట్ ఉన్నదనే కారణంతో పాటు పూర్తిగా బూడిదను తరలించలేకపోయామంటూ 2020 మే నెలలో కూడా మూడు నెలలు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. అయితే కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో బూడిద తరలించడం సాధ్యం కాలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంట్రాక్టు సంస్థ తాజాగా కోర్టును ఆశ్రయించింది. గతంలో పొందిన ఆర్డర్ ప్రకారం కోర్టు అనుమతి ఇవ్వగా దాన్ని బేస్ చేసుకుని ఎఫ్సీఐకి చెందిన డైరెక్టర్ల బోర్డు మరో రూ.30 లక్షలు కాషన్ డిపాజిట్ కింద కట్టించుకుని 2022 జూన్ 28 నుంచి 18 నెలల పాటు సుమారు రూ.10 కోట్ల విలువైన బూడిదను తరలించుకునేందుకు మళ్లీ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం బూడిదను తరలించే పనిలో సదరు కాంట్రాక్టు సంస్థ నిర్వాహకులున్నారు. బూడిద కుప్పల్లో ఓ వైపున పెద్ద ఎత్తున నీళ్లు నిల్వ ఉన్నాయి. బూడిద తరలించే క్రమంలో నీళ్లు పక్కనే ఉన్న కాలనీల్లోకి చేరే ప్రమాదం ఉంది. ఇలా జరిగితే శాంతినగర్, వీర్లపల్లి, విఠల్నగర్, తిలక్ నగర్ ప్రాంతాల్లో ఇండ్లు మునిగిపోయే ప్రమాదం ఉంది.
ఆదాయం కోల్పోతున్న ఎఫ్సీఐ
రామగుండం ఎన్టీపీసీ సంస్థలో టెండర్ పిలిచి టన్ను బూడిదను రూ.402 చొప్పున అమ్ముతుంటే, ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీలోని బూడిదను నామినేషన్ పద్ధతిన టెండర్ లేకుండా కాంట్రాక్టు సంస్థకు ఎలా అప్పగిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు ఎఫ్సీఐ ఆధీనంలో ఉన్న భూములు, ఆస్తులు ప్రస్తుతం ఆర్ఎఫ్సీఎల్ కంపెనీ మేనేజ్మెంట్కు బదలాయింపు చేశారు. అలాగే ఈ భూములు, ఆస్తులను తాకట్టు పెట్టి ఆర్ఎఫ్సీఎల్ మేనేజ్మెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద లోన్ తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఎఫ్సీఎల్ ఆధీనంలో ఉన్న బూడిదను బయటకు ఎలా పంపిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా బూడిదను నామినేషన్ పద్ధతిన ఇవ్వడం వల్ల సంస్థ పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతోంది.
ఎన్ఓసీ కోసం గులాబీ నేతల ఒత్తిడి
అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుడికి బూడిద రవాణా కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పటికే ఢిల్లీలో కొందరు ఆఫీసర్లను మేనేజ్ చేసి ఆర్ఎఫ్సీఎల్లో మిగులుగా ఉన్న బూడిద రవాణాకు సంబంధించి వర్క్ పొందిన గులాబీ నేతలు స్థానికంగా ఉన్న రోడ్లపై లారీలు తిరిగేందుకు అవసరమైన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ఓసీ ఇచ్చేందుకు పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లు ముందుకు రాకపోవడంతో వారిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తున్నది.
టెండర్ పిలవాలి
ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ ఆవరణలో ఉన్న బూడిదను రవాణా చేసేందుకు నామినేషన్ పద్ధతిన కాకుండా టెండర్ పిలవాలి. ఆర్ఎఫ్సీఎల్ ఆధీనంలో ఎఫ్సీఐకి చెందిన ఆస్తులన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు బూడిద రవాణాకు సంబంధించి ఎఫ్సీఐకి చెందిన కన్సల్టెంట్ ఎలా నిర్ణయం తీసుకుంటుంది. బూడిదను తొలగించిన చోట కింద భాగంలో జీడీకే 7 ఎల్ఈపీ బొగ్గు గని ఉంది. అలాగే బూడిదను తొలగించడం వల్ల పక్కనే ఉన్న వీర్లపల్లి, విఠల్నగర్, తిలక్ నగర్ ప్రాంతాల్లోని నివాసాలకు ఇబ్బందిగా మారుతుంది. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్కు సైతం ముప్పు ఏర్పడుతుంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లే బాధ్యత వహించాలి. ఈ వ్యవహరంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి.
‒ పి.మల్లి కార్జున్, బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్