కాంగ్రెస్​కు 20 సెగ్మెంట్లలో కిరికిరి..

కాంగ్రెస్​కు 20 సెగ్మెంట్లలో  కిరికిరి..
  • కాంగ్రెస్​కు 20 సెగ్మెంట్లలో  కిరికిరి.. 
  • రచ్చకెక్కుతున్న లీడర్ల గ్రూప్​ పాలిటిక్స్​
  • బహిరంగంగా దాడులు.. వ్యతిరేకంగా నినాదాలు
  • గాంధీభవన్​లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
  • పెద్ద నేతలు వార్నింగ్​లు ఇస్తున్నా తీరు మార్చుకోని లోకల్​ లీడర్లు
  • ఎన్నికల వేళ కలవరపడుతున్న కేడర్​

హైదరాబాద్​, వెలుగు : కాంగ్రెస్​ పార్టీలో నేతల మధ్య టికెట్లు, వర్గ పోరు మళ్లీ తీవ్రమైంది. లీడర్లు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు.. కలబడుతున్నారు. గాంధీభవన్​కు వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. గోడలపై పోస్టర్లూ వేసుకుంటున్నారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో గ్రూపు లొల్లులు ఎక్కువయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రూపు పంచాయితీలు ఇట్లనే కొనసాగితే.. టికెట్​ఇచ్చిన అభ్యర్థులకు ఎదుటివర్గం సహకరిస్తుందా? అని పార్టీ పెద్దల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లొల్లి పెట్టుకుంటున్న నేతలకు గాంధీభవన్​ నుంచి వార్నింగ్​లు వెళ్తున్నా.. నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉన్నది. 

కొందరు లీడర్లు తమ తీరును మార్చుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీలోని పెద్ద నేతల మధ్యనే సఖ్యత లేకపోవడం  కేడర్​ను ఇంకింత కలవరపాటుకు గురిచేస్తున్నది. 

చిన్నారెడ్డిపై కంప్లైంట్​

మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఇటీవల వనపర్తి కాంగ్రెస్​ నేతలు గాంధీభవన్​లో ఏఐసీసీ కార్యదర్శులకే నేరుగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఆయనకు వన పర్తి టికెట్​ ఇవ్వొద్దని, ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు. మేఘారెడ్డి లేదా శివసేనారెడ్డికి టికెట్​ ఇవ్వాలన్న డిమాండ్​ ఊపందుకుంది. నాగర్​ కర్నూల్​ నుం చి సీనియర్​ నేత నాగం జనార్దన్​రెడ్డి టికెట్​ ఆశిస్తున్నా రు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి కుమారుడు రాజేశ్​రెడ్డి కూడా ఇక్కడి నుంచి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఆ టికెట్​ తనకే ఇవ్వాలంటూ నాగం డిమాండ్​ చేస్తున్నారు. ఆయనకు, గాంధీభవన్​కు కాస్తంత దూరం పెరిగిందన్న చర్చ జరుగుతున్నది. కొల్లాపూర్​ టికెట్​ కోసం జూపల్లి కృష్ణా రావు, చింతపల్లి జగదీశ్వర్​ రావు పోటీ పడుతున్నారు. టికెట్​ తనదంటే తనదేనంటూ పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు. పోటాపోటీగా నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు. 

ఉమ్మడి ఆదిలాబాద్​ అంతా లొల్లే

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని దాదాపు మూడు నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ లీడర్ల నడుమ పంచాయితీలు నడుస్తున్నాయి. ఖానాపూర్ ​బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రేఖా నాయక్​.. బీఆర్​ఎస్​ టికెట్​ రాకపోవడంతో కాంగ్రెస్​ తరఫున టికెట్​ కోసం అప్లై చేసుకున్నారు. ఆమెకు టికెట్​ ఇస్తే సహకరించేది లేదని మరో ఆస్పిరెంట్​ చారులత రాథోడ్​ తేల్చి చెప్తున్నారు. మరో పోటీదారు వెడ్మ బొజ్జు టికెట్​ ఆశిస్తున్నారు. ఆసిఫాబాద్​లో శ్యామ్​ నాయక్​, సరస్వతి మధ్య పోటీ ఉంది. ఇక, బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరిన కంది శ్రీనివాస్​ రెడ్డి.. ఇటీవల బీసీ మీటింగ్​కు వెళ్తే, ఆదిలాబాద్​ డీసీసీ ప్రెసెడెంట్​ సాజిద్​ఖాన్​ వర్గం నేతలు కంది వర్గం నేతలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అది చైర్లు విసురుకునేదాకా వెళ్లింది. వాళ్లిద్దరితో పాటు ఆదిలాబాద్​ నుంచి మరో కాంగ్రెస్​ సీనియర్​ నేత గండ్రత్​ సుజాత కూడా ఇప్పటికే పోటీకి సై అంటున్నారు.  ఎవరికి టికెట్​ ఇచ్చినా అవతలి వర్గం వారు సహకరిస్తారా అనేది డౌటే.

ఉమ్మడి వరంగల్​ సరేసరి

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పలు నియోజకవర్గాల్లోని నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. జనగామ నియోజకవర్గం నుంచి పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​రెడ్డి మధ్య చిచ్చు రగిలింది. ఇటీవల అప్లికేషన్​ ఇచ్చేందుకు వచ్చిన పొన్నాల వర్గీయులు.. అడ్డంగా నరికేస్తామంటూ ఎదుటి వర్గం టార్గెట్​గా నినాదాలు చేశారు. స్క్రీనింగ్​ కమిటీ భేటీలో రేవంత్​తో కొమ్మూరి ప్రతాప్​ రెడ్డిపై తీవ్రస్థాయిలోనే పొన్నాల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. తనకు తెలియకుండా నియోజకవర్గంలో కొమ్మూరికి డీసీసీ ప్రెసిడెంట్​ పదవి ఎట్లా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించినట్టు టాక్​. వరంగల్​ ఈస్ట్​లో కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ మధ్య పోరు జరుగుతున్నది. వరంగల్​ వెస్ట్​ (హనుమకొండ)లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్​రెడ్డి, జంగా రాఘవరెడ్డి మధ్య వైరం ఉంది. గతంలో హనుమకొండ జిల్లాకు వస్తున్నారన్న కారణంతో క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆరోపిస్తూ జిల్లా కాంగ్రెస్​ పార్టీ నుంచి రాఘవరెడ్డిని నాయిని రాజేందర్​రెడ్డి సస్పెండ్​ కూడా చేశారు. ఇది ముదిరి గాంధీభవన్​ దాకా చేరింది. పరకాల నుంచి కొండా మురళి టికెట్​ ఆశిస్తుండగా.. ఇనుగాల వెంకటరామిరెడ్డి పోటాపోటీగా ప్రయత్నిస్తున్నారు. ప్రచారమూ చేసుకుంటున్నారు. వాళ్ల పంచాయితీ కూడా గాంధీభవన్​ గడపను తాకింది. వర్ధన్నపేటలోనూ సిరిసిల్ల రాజయ్య, నడిమిండ్ల శ్రీనివాస్​ మధ్య పోటాపోటీ నెలకొంది.

గజ్వేల్​లో కొట్టుకున్నరు

గజ్వేల్​ టికెట్​ కూడా కాంగ్రెస్​లో హాట్​ కేకే. సీఎం కేసీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ తరఫున పోటీకి తూముకుంట నర్సారెడ్డి, బండారు శ్రీకాంత్​ రావు సై అంటున్నారు. టికెట్​ తనదేనంటూ ఇరు వర్గాలు గొడవలకు దిగుతున్నాయట. ఆ రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  

పెద్ద లీడర్లలోనే ఐక్యత కరువు

నియోజకవర్గాల్లోని నేతల సంగతి పక్కనపెడితే.. అసలు పార్టీలోని పెద్ద నేతల మధ్యనే సఖ్యత లేదన్నదని కేడర్​ అంటున్నది.  పెద్ద లీడర్లు పైపైకి నవ్వుకుంటూ మాట్లాడినట్టే ఉన్నా.. లోలోపల మాత్రం రగిలిపోతూనే ఉన్నారు. ఐదు రోజుల కిందట జరిగిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఇష్యూ హాట్​ టాపిక్​ అయింది. అసలు తనకు విలువే లేకుండా పోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కమిటీలోనూ చోటు కల్పించలేదని లోలోపల మండిపడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, రేవంత్​రెడ్డి మధ్య కూడా సంబంధాలు అంతగా లేవన్నది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల ఉత్తమ్​కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెరిగింది. కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు దక్కింది. రేవంత్, జగ్గారెడ్డి సీఎల్పీలో నవ్వులు చిందించినా.. పరోక్షంగా మాత్రం కత్తులు దూసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇట్ల కీలక నేతల మధ్యే సఖ్యత లేకుంటే.. పార్టీకి నష్టం తప్పదన్న ఆందోళన కేడర్​లో వ్యక్తమవుతున్నది.

ఉమ్మడి కరీంనగర్​లో ఇట్ల

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కరీంనగర్​ బరి నుంచి తప్పుకున్న పొన్నం ప్రభాకర్​.. హుస్నాబాద్​నుంచి టికెట్​ కోసం అప్లై చేసుకున్నారు. అక్కడి నుంచి పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇదే స్థానం పోటీకి ప్రవీణ్​రెడ్డి సై అంటున్నారు. అయితే.. ప్రవీణ్​రెడ్డి కాంగ్రెస్​ను వీడి బీఆర్​ఎస్​లోకి వెళ్లి.. అక్కడ టికెట్​ రాకపోవడంతో మళ్లీ కాంగ్రెస్​లో చేరారని పొన్నం వర్గం వాదిస్తున్నది. ఇప్పటికే పొన్నంతో పాటు ప్రవీణ్​ రెడ్డి కూడా అక్కడ గ్రౌండ్​ వర్క్​ స్టార్ట్​ చేసేశారన్న చర్చ జరుగుతున్నది. మరోవైపు కరీంనగర్​లో కొత్త జైపాల్​రెడ్డి, కొణగాల మహేశ్, మేనేని రోహిత్​రావు, రమ్యరావు, రిషిత్​ రావు మధ్య తీవ్రమైన పోటీ ఉంది. కొత్త జైపాల్​రెడ్డి.. ఇటీవల భారీ కాన్వాయ్​తో వచ్చి కాంగ్రెస్​ పార్టీలో చేరారు. టికెట్​ ఆయనకే దాదాపు కన్ఫర్మ్​ అన్న ప్రచారం జరుగుతున్నది. 

మధు యాష్కీపై పోస్టర్లు

ఇటీవల గాంధీభవన్​లో మధుయాష్కీపై వేసిన పోస్టర్లు ఎంత కలకలం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఎల్బీ నగర్​ టికెట్​ ఆశిస్తున్న మధు యాష్కీకి వ్యతిరేకంగా.. ఎల్బీనగర్​ కాంగ్రెస్​ పేరిట పోస్టర్లు వెలిశాయి. అది వేయించింది మరో ఆశావహుడు జక్కిడి ప్రభాకర్​రెడ్డి అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఘటన అటు తిరిగి ఇటు తిరిగి ఎల్బీనగర్​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి మీదికి మళ్లింది. అయితే, ఇప్పటికే అక్కడి నుంచి పోటీ కోసం ప్రభాకర్​రెడ్డి గ్రౌండ్​వర్క్​చేశారట. దాంతో పాటు మల్​రెడ్డి రాంరెడ్డి కూడా ఎల్బీనగర్​ నుంచి టికెట్​ఆశిస్తున్నారు. ఈ టికెట్​దాదాపు మధు యాష్కీకి కన్ఫర్మ్​ అయిపోతుందన్న చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే అక్కడ మరో ఇద్దరు ఆశావహుల నుంచి ఆయనకు ఎంతమేర మద్దతు లభిస్తుందోనని కేడర్​ ఆందోళన చెందుతున్నది.  బయటకు మంచిగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం ఎవరికి వారు టికెట్​ తమకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారని టాక్​. 

నల్గొండలోనూ లొల్లే 

ఇటీవలి కాలంలో బాగా హాట్​ టాపిక్​ అయిన నియోజకవర్గం మునుగోడు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్​రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. బై పోల్​లో పోటీకి కాంగ్రెస్​ తరఫున చెల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్నా కైలాష్​ నేత టికెట్​ ఆశించారు. చివరికి పాల్వాయి స్రవంతికి టికెట్​ ఇచ్చారు. అయితే, ఆమె ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్​ నేతల నడుమ ట్రయాంగిల్​ ఫైట్​ నడుస్తున్నది. చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్​ ఇవ్వొద్దని ఎదుటి వర్గం నేతలు పట్టుబడుతున్నారు. ఆయనకు టికెట్​ ఇస్తే సహకరించబోమని తేల్చి చెప్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోనూ మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్​ బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ చీఫ్​ శంకర్​నాయక్​ మధ్య గొడవ జరుగుతున్నది. కొద్ది నెలల కింద ఓ మీటింగ్​లో రెండు వర్గాల వాళ్లు చైర్లతో కొట్టుకున్నారు. అదికూడా గాంధీభవన్​ వరకు చేరింది. ఇప్పుడు ఆ ఇద్దరూ మిర్యాలగూడ టికెట్​కు అప్లై చేసుకున్నారు. వాళ్లతో పాటు జానారెడ్డి కుమారుడు రఘువీర్​రెడ్డి కూడా మిర్యాలగూడ టికెట్​ కోసం పోటీ పడుతున్నారు. జానారెడ్డికి శంకర్​నాయక్​ చాలా దగ్గరని పేరు. చాలా సందర్భాల్లో గొడవలు జరిగినప్పుడు శంకర్​నాయక్​ను ఆయన వెనకేసుకొచ్చారన్న వాదనలూ ఉన్నాయి.

హైదరాబాద్​లోనూ అంతే.. 

హైదరాబాద్​ సిటీ పరిధిలోని పలు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్​ లీడర్ల మధ్య పరిస్థితి కొట్టుకు నే దాకా వెళ్లింది. జూబ్లీహిల్స్​పరిధిలో టికెట్​ఆశిస్తున్న విష్ణువర్ధన్​ రెడ్డి, అజారుద్దీన్​ వర్గాల మధ్య నెల కింద గొడవ జరిగింది. విష్ణు ప్రత్యర్థి వర్గంతో అజారుద్దీన్​ సమావేశాలు నిర్వహిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నెల కింద రహమత్​నగర్​లో అజారు ద్దీన్​ వర్గం మీటింగ్​ పెట్టింది. దీనికి తనను ఆహ్వానించలేదని విష్ణువర్ధన్​ రెడ్డి తన వర్గంతో అక్కడికి వెళ్లి.. అజారుద్దీన్​ను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉప్పల్​లో ఇటీవల రేవంత్​రెడ్డి పర్యటనలోనే లక్ష్మారెడ్డి, రజిత పరమేశ్వర్ ​రెడ్డి బాహాబాహీకి దిగారు. కార్పొరేటర్​ అయిన తమ నాయకుడి పేరు, ఫొటో పెట్టలేదంటూ లక్ష్మారెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పరమేశ్వర్​రెడ్డి వర్గం చింపేసింది. దీంతో ఆ ఇద్దరు నేతల అనుచరులు కట్టెలతో కొట్టుకున్నారు. కుత్బుల్లాపూర్​లో నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలను హన్మంత్​ రెడ్డి  ఎవరికివారు టికెట్​ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేసుకున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మల్​రెడ్డి రంగారెడ్డి, దండెం రాంరెడ్డి అప్లికేషన్లప్పుడే తమ బల ప్రదర్శన చేశారు.