చమురు ధరల పెరుగుదల ఎక్కువ కాలం ఇలాగే ఉండదని, రెండు వారాల్లోపు పీపా ధర 100 డాలర్లకు తగ్గుతుందని భారత్ పెట్రోలియం కార్పొరేషన్లిమిటెడ్ (బీపీసీఎల్) ఎండీ, చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పూర్తిగా ముగిస్తే ధర 90 డాలర్లకూ పడిపోవచ్చని పేర్కొన్నారు. ఇండియా భయపడాల్సిన అవసరం లేదని, ఇప్పటికీ రష్యా నుంచి సప్లై ఆగిపోలేదని చెప్పారు. రష్యా తనంత తానుగా సప్లైలను ఆపితేనే సమస్య వస్తుందని, ఆ పరిస్థితి ఎదురు కాకపోవచ్చని చెప్పారు. యూరప్ కూడా రష్యా నుంచి గ్యాస్ కొనడం ఆపే అవకాశాలు లేవని అన్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు పీపా ధర 139 డాలర్ల వరకు ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించే ప్రపోజల్ను యూఎస్, యూరప్దేశాలు పరిశీలిస్తున్నాయని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. రష్యా నుంచి దిగుమతులను ఆపే ఉద్దేశం లేదని జర్మనీ స్పష్టం చేయడంతో ధరలు కొంత తగ్గాయి. తమ దగ్గరి నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తే పరిస్థితులు ఘోరంగా మారతాయని, పీపా ధర 300 డాలర్లకు పెరుగుతుందని రష్యా హెచ్చరించింది.