- 20 కంపెనీల హస్తం.. వీటిలో ఎఫ్పీఐలు, సెక్యూరిటీ కంపెనీలు, జర్నలిస్టులు కూడా
- భారీ లాభాలను ట్యాక్స్ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ చేయని కొన్ని ఇండియన్ కంపెనీలు
న్యూఢిల్లీ : హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ కంపెనీలపై రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేయకముందే ఈ కంపెనీల షేర్లను షార్ట్ సెల్లింగ్ చేసి 20 కి పైగా కంపెనీలు, ప్రొఫెషనల్స్ భారీగా లాభపడ్డారు. సెబీ ఈ విషయాన్ని బయట పెట్టిన విషయం తెలిసిందే. వీటిలో సెక్యూరిటీ కంపెనీలు, మీడియా ప్రొఫెషనల్స్, జర్నలిస్టులు కూడా ఉన్నట్టు గుర్తించింది. షార్ట్ సెల్లింగ్ చేయడం ద్వారా వచ్చిన లాభాలపై ట్యాక్స్లు ఎగ్గొట్టినందుకు కొన్ని కంపెనీలపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు జరుపుతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి వీరికి ముందే తెలుసని, ఈ రిపోర్ట్ను బాగా పాపులర్ చేసేందుకు కొంత మంది జర్నలిస్టులు కూడా సాయపడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘ఈ విషయానికి సంబంధించి ఈ ఏడాది జులైలోనే మా ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. సెబీ దర్యాప్తు జరుపుతోంది కాబట్టి ఈ సమాచారాన్ని మార్కెట్ రెగ్యులేటర్కు పంపాం. వీరు ఏమైనా ఫిర్యాదులు ఫైల్ చేస్తే మరింత దర్యాప్తు చేస్తాం. కోర్టు డైరెక్షన్స్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు. అదానీ– హిండెన్బర్గ్ ఇష్యూ ద్వారా పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లు నష్టపోయారని, అందుకే తాము సీరియస్గా ఉన్నామని ఆయన వివరించారు.
షార్ట్ చేసిన లిస్ట్లో ఇండియన్ బ్యాంక్ ఒకటి ..
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను షార్టింగ్ చేసిన వారిలో లండన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, మారిషస్, హాంకాంగ్, కేమాన్ ఐలాండ్స్ కు చెందిన కొన్ని ఎఫ్పీఐలు, సెక్యూరిటీ కంపెనీలు ఉన్నాయి. ఇండియాలోని ఒక ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఢిల్లీకి చెందిన రెండు బ్రోకరేజి కంపెనీల హస్తం కూడా ఉంది. పైన పేర్కొన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కు ఒక గ్రూప్ కంపెనీ ఉందని, ఈ కంపెనీ బ్యాంకింగ్ సర్వీస్లు అందిస్తోందని ఈడీ తెలిపింది.
కంపెనీల పేర్లను బయటపెట్టలేదు. ఇండియాలో షార్ట్ సెల్లింగ్ చేయడం నేరం కాదు. ‘ఈ ఇష్యూ కోర్టుల్లో ఉంది. అంతేకాకుండా వివిధ ఏజెన్సీలు దర్యాప్తు జరుపుతున్నాయి. అందువలన ప్రస్తుత స్టేజ్లో ఎటువంటి పేర్లను బయటపెట్టలేము’ అని ఈడీ అధికారి పేర్కొన్నారు. షార్టింగ్ సెల్లింగ్ లాభాలను చాలా కంపెనీలు ఐటీ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ చేయలేదని, దీంతో ఈ ఏజెన్సీ కూడా దర్యాప్తు జరుపుతోందన్నారు.
పెద్ద కుట్ర జరిగింది!
అతిపెద్ద ఆర్థికపరమైన కుట్ర జరిగినట్టు కనిపిస్తోందని, విదేశీ కంపెనీలు లాభాల కోసం, జియో పొలిటికల్ కారణాల దృష్ట్యా ఇండియన్ కంపెనీలపై దాడులు చేస్తున్నాయని లీగల్ ఎక్స్పర్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు. జార్జ్ సోరస్కు చెందిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కార్పొరేషన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) జీ20 లీడర్షిప్ సమ్మిట్, జనరల్ ఎలక్షన్స్కు ముందు కొన్ని ఇండియన్ కార్పొరేట్ కంపెనీలపై రిపోర్ట్స్ విడుదల చేయొచ్చని పీటీఐ (న్యూస్ ఏజెన్సీ) తాజాగా పేర్కొంది. తన దర్యాప్తులో సేకరించిన కీలక సమాచారాన్ని సెబీతో ఈడీ పంచుకుందని, సెబీ ఈ ఇష్యూపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందని సంబంధిత వ్యక్తి పేర్కొన్నారు.
అదానీ – హిండెన్బర్గ్ ఇష్యూపై దర్యాప్తుకు మరో 15 రోజులు టైమ్ కావాలని సుప్రీం కోర్టును సెబీ ఆశ్రయించడం తెలిసిందే. ఈ విషయంపై సెప్టెంబర్ 1 లేదా నాలుగున హియరింగ్ ఉంది. సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం ఆగస్టు 14 లోపే సెబీ తన పూర్తి రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి. కాగా, అదానీ కంపెనీల షేర్లు పెరగడంలో అదానీ గ్రూప్ హస్తం ఉందని, స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్స్ జరిగాయని ఈ ఏడాది జనవరిలో యూఎస్ రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్ రిపోర్ట్ విడుదల చేసింది. దీంతో కంపెనీ షేర్లు 70 శాతం వరకు పడ్డాయి. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ 150 బిలియన్ డాలర్లు (రూ. 12 లక్షల కోట్లు) నష్టపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ తన రూ.20 వేల కోట్ల షేర్ సేల్ను ఆపుకోవాల్సి వచ్చింది.