న్యూఢిల్లీ : ఉల్లిపాయలు, టమాటాల ధరలు పెరగడంతో ఈ ఏడాది నవంబర్లో వెజ్, నాన్ వెజ్ మీల్స్ రేట్లు అక్టోబర్ నెలతో పోలిస్తే పెరిగాయి. నెల వారి ప్రాతిపదికన ఉల్లిపాయల రేట్లు58 శాతం, టమాటాల ధరలు 35 శాతం పెరిగాయని క్రిసిల్ ఎంఎల్ అండ్ ఏ రీసెర్చ్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. ఖరీఫ్ సీజన్లో దిగుబడి తగ్గడంతో పాటు పండుగ టైమ్లో డిమాండ్ పెరగడంతో వీటి రేట్లు పెరిగాయని వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, కిందటి నెలలో వెజ్ భోజనం ధర అక్టోబర్తో పోలిస్తే 10 శాతం, నాన్ వెజ్ భోజనం ధర 5 శాతం పెరిగాయి.
వెజ్ భోజనంతో పోలిస్తే నాన్ వెజ్ భోజనం ధరలు తక్కువగా పెరిగాయని, దీనికి కారణం బాయిలర్ కోళ్ల రేట్లు 1–3 శాతం దిగిరావడమేనని వెల్లడించింది. నాన్ వెజ్ భోజనం మొత్తం రేటులో చికెన్ వాటానే 50 శాతం వరకు ఉంటుంది. కిందటేడాది నవంబర్తో పోలిస్తే కిందటి నెలలో వెజ్ భోజనం రేట్లు 9 శాతం పెరిగాయి. ఇదే టైమ్లో ఉల్లిపాయల ధరలు 93 శాతం, టమాటా ధరలు 15 శాతం పెరిగాయి. పప్పుల ధరలు 21 శాతం పెరిగాయని, వీటి ఫలితంగా వెజ్ భోజనం ధర ఎక్కువగా పెరిగిందని క్రిసిల్ రిపోర్ట్ వెల్లడించింది.
కాగా, వెజ్ భోజనంలో పప్పుల వాటా 9 శాతం ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ భోజనం ఇండ్లలో చేసుకోవడానికి అయ్యే ఖర్చు ఆధారంగా ఈ రిపోర్ట్ రెడీ చేశారు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇండియాల్లోని కూరగాయల ధరలను పరిగణనలోకి తీసుకొని రిపోర్ట్ తయారు చేశామని క్రిసిల్ వెల్లడించింది. నెల వారి ఖర్చులు పెరగడంతో కామన్ మ్యాన్పై భారం పెరుగుతోందని తెలిపింది. పప్పులు, కూరగాయలు, స్పైసెస్, వంట నూనె, కుకింగ్ గ్యాస్ ధరల్లో మార్పు రావడంతో భోజనం రేట్లు మారుతున్నాయని పేర్కొంది.