IND vs AFG 1st T20I: దుమ్మురేపిన కుర్రాళ్లు.. తొలి టీ20 భారత్‌దే

IND vs AFG 1st T20I: దుమ్మురేపిన కుర్రాళ్లు.. తొలి టీ20 భారత్‌దే

మొహాలీ వేదికగా అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘన్లు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. భారత యువ జట్టు మరో 15 బంతులు మిగిలివుండగానే దాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

రోహిత్ డకౌట్ 

159 పరుగుల ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు రెండేళ్ల తరువాత టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ(0) ఖాతా తెరవకుండానే రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఓవర్‌లోనే వికెట్ నష్టపోయింది. అనంతరం గిల్ (23; 12 బంతుల్లో 5 ఫోర్లు)- తిలక్ వర్మ(26; 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) జోడి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆపై వీరిద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(60 నాటౌట్; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జితేష్ శర్మ(31; 20 బంతుల్లో 5 ఫోర్లు) అఫ్ఘన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 

ఈ జోడి నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. దీంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఈ క్రమంలో దూబే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అనంతరం జితేష్ ఔటవ్వగా దూబే- రింకూ సింగ్(16 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు) జోడి మ్యాచ్ ముగించారు.       

ఆదుకున్న నబీ

అంతకుమందు ఆల్‌రౌండర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్‌(29; 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్), మహ్మద్‌ నబీ(42; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో అఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 

ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం(జనవరి 14) ఇండోర్ వేదికగా రెండో టీ20 జరగనుంది.