
బంగ్లాతో జరుగుతోన్న ఫస్ట్ టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా బ్యాట్స్ మెన్ ను భారత బౌలర్లు వెనువెంటనే పెవిలియన్ చేర్చారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా కేవలం133/8 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో మెహిదీ మిరాజ్ 16, ఎబాడట్ హోస్సేన్ 13 ఉన్నారు. బంగ్లాదేశ్ ఇంకా 271 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు 4, సిరాజ్ కు 3, ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ పడ్డాయి.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 276/6 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత జట్టు..కొద్దిసేపటికే 7వ వికెట్ కోల్పోయింది. తొలి రోజు 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్..86 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ సమయంలో అశ్విన్, కుల్దీప్ యాదవ్ జట్టుకు అండగా నిలిచారు. ఈ ఇద్దరు బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 8వ వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, మెహ్ దీ హసన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఖలీద్ అహ్మద్, ఎబాడోట్ హొస్సేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.