- సంజూ శాంసన్పై తీవ్ర ఒత్తిడి
- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్లో లైవ్
గువాహతి: సొంతగడ్డపై టీ20 వరల్డ్ కప్లో టైటిల్ డిఫెండ్ చేసుకునేందుకు రెడీ అవుతున్న టీమిండియా అంతకంటే ముందు న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే 2-–0 ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సేన ఆదివారం గువాహతిలోని బర్సాపరా స్టేడియంలో జరిగే మూడో టీ20నూ గెలిచి ఇక్కడే సిరీస్ నెగ్గాలని భావిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో కివీస్ను చిత్తు చేసిన టీమిండియా ఫుల్జోష్లో ఉంది. అయితే, ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. ఓపెనర్ సంజూ శాంసన్కు కొత్త చిక్కులు తెచ్చాయి.
ఇషాన్ గత మ్యాచ్లో అద్భుతంగా ఆడగా.. శాంసన్ రెండు ఇన్నింగ్స్ల్లో 10, 6 స్కోర్లతో విఫలమయ్యాడు. దాంతో వరల్డ్ కప్లో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరిని పంపాలనే దానిపై మళ్లీ చర్చ మొదలైంది. ఎక్స్ట్రా పేస్ను ఎదుర్కోవడంలో బలహీనతను మళ్లీ బయటపెట్టిన శాంసన్ కీపింగ్లోనూ తడబడుతున్నాడు. అదే టైమ్లో ఇషాన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటంతో శాంసన్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో సంజూ ఫామ్ అందుకోకపోతే వరల్డ్ కప్లో బెంచ్కే పరిమితం అయ్యే ప్రమాదం ఉంది. స్టార్ పేసర్ బుమ్రా లేకపోయినా.. గత పోరులో బౌలర్లు ఫర్వాలేదనించారు. బుమ్రా తిరిగి వస్తే బౌలింగ్ బలం మరింత పెరగనుంది. చేతి వేలి గాయానికి గురైన అక్షర్ పూర్తిగా కోలుకోకుంటే కుల్దీప్ ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగుతాడు.
కివీస్ పోటీ ఇచ్చేనా..
గతేడాది టెస్టుల్లో, ఈ నెలలో వన్డేల్లో ఇండియాను ఓడించిన న్యూజిలాండ్.. షార్ట్ ఫార్మాట్లో మాత్రం తేలిపోతోంది. వరుసగా రెండు ఓటములతో 0–2తో ఉన్న కివీస్ ఇప్పుడు చావోరేవో తేల్చుకోనుంది. సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్ కావడంతో కెప్టెన్ మిచెల్ శాంట్నర్.. తన వ్యూహాలు మార్చనున్నాడు. ఇన్ఫామ్ బ్యాటర్ డారిల్ మిచెల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ మెరుగైతేనే కివీస్ సిరీస్లో నిలుస్తుంది.
