IND vs NZ : లోపాల్ని సరిదిద్దుకోవడమే కీలకం

IND vs NZ : లోపాల్ని సరిదిద్దుకోవడమే కీలకం

టీమిండియా.. బంగ్లాదేశ్, శ్రీలంకలతో ఆడిన సిరీసుల్లో టాప్ క్లాస్ ఆటతో గెలిచింది. న్యూజిలాండ్ తో ఆడిన మొదటి వన్డేలోనూ పోరాడి విజయం సాధించింది. అయితే ప్లేయింగ్ లెవన్ లోని ఆటగాళ్లంతా వాళ్ల స్థాయికి తగ్గట్టు ఆడుతున్నారా? జట్టుకు పూర్తి స్థాయి న్యాయం చేస్తున్నారా? అంటే సమాధానం చెప్పడం కష్టం. జట్టును ముందుండి నడిపించాల్సిన సీనియర్ ఆటగాళ్లు నిలకడ లేని ఆటతీరుతో ఇబ్బంది పడుతుండటం అందుకు కారణం. ఈ పరిస్థితికి ఒత్తిడి కారణమా లేక ఫామ్ కోల్పోయారా అన్న దానిపై టీం సెలక్టర్లకు క్లారిటీ రావటంలేదు. స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే  కసరత్తులు మొదలుపెట్టిన టీమిండియా.. జట్టులో మార్పులేకా దు, ఆటగాళ్ల లోపాల్ని గుర్తించి వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. టీంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ తమ లోపాల్ని గుర్తించి, వరల్డ్ కప్ కల్లా ఆటతీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.

రోహిత్ శర్మ: ఈ మధ్యకాలంలో ఒక్క శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో తప్ప రోహిత్ శర్మ ఆటతీరు ఏమంతగా ఆకట్టుకోలేదు. నిజానికి టీ20 వరల్డ్ కప్ నుంచి అతను ఇదే ఆటతీరు కొనసాగిస్తున్నాడు. ఓపెనర్ గా, కెప్టెన్ గా ముందుండి ఇన్నింగ్స్ నిలబెట్టాల్సినవాడు ఆటలో తేలిపోవడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ.

హార్దిక్ పాండ్యా: ఆల్ రౌండర్ గా మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్నవాడు పాండ్యా. బౌలింగ్ లోనూ జట్టుకు కీలక ప్లేయరే. కెప్టెన్, వైస్ కెప్టెన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదని విమర్శకుల మాట. బౌలింగ్ లో ఒకట్రెండు ఓవర్లు మినహా పెద్దగా ఉపయోగపడట్లేదు. కొన్ని సార్లు పరుగులు ఇచ్చేస్తున్నాడు. నిజానికి హార్దిక్ క్రీజ్ లో ఉంటే ప్రత్యర్థికి దడ. తన విధ్వంసకర ఆటతీరుతో బౌలర్లకు చుక్కలు చూపించగల మ్యాచ్ హిట్టర్. అయితే, ఈ మధ్య హార్దిక్ ఆటలో ఆ భారీ షాట్లు కనిపించడంలేదు. మ్యాచ్ మొదటి బంతి నుంచే బాదే సత్తా ఉన్నా.. డాట్ బాల్స్ చేస్తూ, అనవసర షాట్లు ఆడి వికెట్లు పారేసుకుంటున్నాడు. 

మహమ్మద్ షమీ: సీనియర్ ఫాస్ట్ బౌలర్ గా షమీ జట్టుకు వెన్నెముకలా నిలబడాలి. కీలక వికెట్లు, భాగస్వామ్యాలు విడగొడుతూ జట్టుకు వికెట్లు అందించాలి. అలాంటివాడు వికెట్లు తీయడానికి తంటాలు పడుతున్నాడు. మెయిడెన్ ఓవర్లు, డాట్ బాల్స్ వేస్తున్నాడే గానీ వికెట్లు మాత్రం తీయలేకపోతున్నాడు. 2019 వరల్డ్ కప్ నుంచి షమీది ఇదే తీరు. డెత్ ఓవర్స్ లో కీలకం కావాల్సినవాడు చివరికి పరుగులు సమర్పిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ: విరాట్ ఆసియా కప్ నుంచి ఏ స్థాయిలో రాణిస్తున్నాడో చూస్తున్నాం. ప్రతీ సిరీస్ లో బ్యాటుతో రాణిస్తూ తన స్థానానికి న్యాయం చేస్తున్నాడు. అయితే, స్పిన్ బౌలింగ్ లో మాత్రం ఇది వరకటి ఆట తీరే కనిపిస్తోంది. బాల్ ను అంచనా వేయడంలో, షాట్ సెలక్షన్ లో తప్పుడు నిర్ణయాలతో వికెట్ పారేసుకుంటున్నాడు. వీటిని సరిదిద్దుకుంటే ఇక కోహ్లీని అడ్డుకోవడం ఎవరివల్ల కాదు.

ఇషాన్ కిషన్: రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ కావడంతో ఆ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కు ఇది మంచి అవకాశం. ట్యాలెంట్ ఉన్నా నిలకడగా రాణించలేకపోతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ తర్వాత వచ్చిన అవకాశాల్లో ఏ మాత్రం రాణించలేదు. అనవసర షాట్లు ఆడుతూ వికెట్ ఇచ్చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని గనుక సద్వినియోగం చేసుకోలేకపోతే ఇషాన్ జట్టులో కొనసాగడం కష్టమే.