- ఇక సమరమే... రేపటి నుంచి ఆసియాకప్
- ఆదివారం ఇండో‑పాక్
- హై ఓల్టేజ్ మ్యాచ్
- బరిలో ఆరు జట్లు
వెలుగు వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్కు రంగం సిద్ధమైంది. శనివారం అఫ్గానిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ టోర్నీలో మిగతా మ్యాచ్ల సంగతి ఎలా ఉన్నా.. హై ఓల్టేజ్ సమరం మాత్రం ఆదివారం జరగనుంది. అదే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. దీంతో ఐసీసీ, ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి. దీంతో వేదిక ఎక్కడైనా ఈ మ్యాచ్లో ఉత్కంఠ, భావోద్వేగాలు ఓ రేంజ్లో ఉంటాయి.
ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇండియా, పాక్ మధ్య 200 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. గతేడాది జరిగిన టీ20 వరల్డ్కప్లో ఇరుదేశాలు చివరిసారి తలపడ్డాయి. కానీ ఎప్పుడూ లేని విధంగా వరల్డ్కప్లో ఫస్ట్ టైమ్ పాకిస్తాన్ ఆ మ్యాచ్లో విజయం సాధించింది. దీంతో ఇప్పుడు టీమిండియా ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. అయితే షార్ట్ ఫార్మాట్లో మాత్రం ఇప్పటివరకు పాక్పై ఇండియాదే ఆధిపత్యం. 9 మ్యాచ్లు ఆడితే టీమిండియా ఆరింటిలో గెలిస్తే, పాక్ రెండు మ్యాచ్ల్లో నెగ్గింది. ఓ మ్యాచ్ టై కాగా, మరో దాంట్లో రిజల్ట్ రాలేదు. 2007 టీ20 వరల్డ్కప్లో తొలిసారి ఇండో–పాక్ పోరు జరిగింది. స్కోర్లు టై కావడంతో నిర్వహించిన బౌల్ అవుట్లో ఇండియా విజయం సాధించి మెగా కప్ను సొంతం చేసుకుంది.
పాక్పై కోహ్లీయే కింగ్
ఈ ఫార్మాట్లో పాక్పై విరాట్కు సూపర్ రికార్డు ఉంది. 7 ఇన్నింగ్స్లో 77.75 యావరేజ్తో 311 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాక్ తరఫున షోయబ్ మాలిక్ హయ్యెస్ట్ స్కోరర్ (164)గా ఉన్నాడు. ఇప్పుడు ఆసియాకప్లో కోహ్లీ బరిలోకి దిగుతుండగా, మాలిక్ టీమ్కు దూరంగా ఉన్నాడు. బౌలింగ్లో భువనేశ్వర్ (5), జడేజా (4) టాప్ ప్లేస్లో ఉన్నారు.
ఫామ్లోనే రోహిత్సేన
గత 10 నెలల్లో టీమిండియా 28 టీ20లు ఆడితే ఇందులో 22 నెగ్గింది. ఐదింటిలో ఓడింది. ఓ మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. న్యూజిలాండ్, వెస్టిండీస్ (రెండుసార్లు), శ్రీలంక, ఐర్లాండ్, ఇంగ్లండ్పై సిరీస్లను గెలిచింది. సౌతాఫ్రికాతో సిరీస్ను 2–2తో డ్రా చేసుకుంది. కాబట్టి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో కప్ను నిలబెట్టుకోవాలని ఇండియా టార్గెట్గా పెట్టుకుంది.
కొత్త జెర్సీలతో ఇరుజట్లు
ఆసియా కప్లో ఇండియా, పాక్ కొత్త జెర్సీలతో ఆడనున్నాడు. ఈ మేరకు కొత్త కిట్ను గురువారం ఆవిష్కరించారు. ఇండియా తరఫున జడేజా కొత్త జెర్సీలో దర్శనమివ్వగా, పాక్ ప్లేయర్లు కూడా కొత్త డ్రెస్లతో ఫొటోలకు ఫోజిచ్చారు. ఇక ఈ టోర్నీ కోసం ఇండియా చాలా జాగ్రత్తలు తీసుకుంది. పాక్తో పాటు మిగతా టీమ్స్ బస చేసే హోటల్లో కాకుండా రోహిత్సేన కోసం బీసీసీఐ పామ్ జుమేరియా రిసార్ట్ను బుక్ చేసింది. ద్రవిడ్ ప్లేస్లో కోచ్ బాధ్యతలు తీసుకున్న వీవీఎస్ లక్ష్మణ్.. టీమ్ ప్రాక్టీస్తో పాటు ప్రత్యేకంగా మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు. మరోవైపు హాంకాంగ్ జట్టు ఆసియా కప్ మెయిన్ డ్రాకు క్వాలిఫై అయ్యింది.