- హర్మన్సేనకు విషమ పరీక్ష
- మ. 3 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో లైవ్
నవీ ముంబై: సొంతగడ్డపై విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో ఫేవరెట్గా బరిలోకి దిగి పడుతూ లేస్తూ నాకౌట్ చేరుకున్న టీమిండియా అత్యంత విషమ పరీక్షకు సిద్ధమైంది. ఎన్నో ఏండ్లుగా ఊరిస్తున్న కలల కప్పును ఈసారైనా చేజిక్కించుకోవాలని ఆశిస్తున్న ఇండియాకు ఆస్ట్రేలియా రూపంలో పెను సవాల్ ఎదురుగా ఉంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఆతిథ్య జట్టు.. టేబుల్ టాపర్, ఏడుసార్లు చాంపియన్ ఆసీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. కంగారూలను పడగొట్టాలంటే ఎనిమిదేండ్ల కిందట వరల్డ్ కప్ సెమీస్లో ఆ టీమ్పై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ హిస్టారికల్ సెంచరీ వంటి ఇన్నింగ్స్ అద్భుతం జరగాలని ఆతిథ్య జట్టు ఆశిస్తోంది. 2017లో ఇంగ్లండ్లోని డెర్బీ స్టేడియంలో జరిగిన నాటి మ్యాచ్లో హర్మన్ (115 బాల్స్లో 171 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ విమెన్స్ టీమ్ గతినే మార్చేసింది. ఇప్పుడు కూడా ఆసీస్పై గెలిస్తే ఇండియా అమ్మాయిలు తొలి ఐసీసీ ట్రోఫీని అందుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.
కాంబినేషన్ కుదిరేనా
ఈ టోర్నీలో హర్మన్సేన ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జట్టులో స్థిరత్వం లేకపోవడం. ఈ కారణంగా సతమతమైన ఇండియా ఓ దశలో వరుసగా మూడు ఓటములు ఎదుర్కొని సెమీస్ బెర్తు కోల్పోయేలా కనిపించింది. కానీ, న్యూజిలాండ్ పని పట్టి నాకౌట్ చేరుకుంది. ఆ మ్యాచ్లో వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి సెంచరీతో విజృంభించిన మరో ఓపెనర్ ప్రతీక రావల్ గాయంతో దూరం అవ్వడం జట్టుకు తీరని లోటు. సూపర్ ఫామ్లో ఉన్న ప్రతీక గైర్హాజరీలో టీమ్ కాంబినేషన్ను మార్చాల్సి వస్తోంది. ప్రతీక ప్లేస్లో వచ్చిన షెఫాలీ వర్మను ఓపెనర్గా తీసుకోవాలా? లేకఆరో బౌలర్కు అవకాశం ఇచ్చేందుకు హర్లీన్ డియోల్ను ఓపెనింగ్కు పంపాలా అనే సందిగ్ధం నెలకొంది. వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, రావల్ ఓపెనింగ్ సగటు 78.21తో పోలిస్తే, మంధాన–-షెఫాలీ జోడీ సగటు 37.20 మాత్రమే ఉంది. మరోవైపు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫామ్ కూడా జట్టును ఆందోళన కలిగిస్తోంది. టోర్నీలో ఇప్పటిదాకా తన మార్కు ఇన్నింగ్స్ ఆడని హర్మన్... 2017 సెమీస్ లాంటి పెర్ఫామెన్స్ చేయాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. టోర్నీలో 365 రన్స్తో సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్న మంధాన ఆటపైనే ఇండియా విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. హర్మన్, హర్లీన్, జెమీమా కూడా సత్తా చాటితేనే ఆసీస్ అడ్డు దాటగలం. బౌలింగ్లో గత మూడు మ్యాచ్లలో విఫలమైన స్నేహ్ రాణా కంటే బంగ్లాదేశ్పై రాణించిన స్పిన్నర్ రాధా యాదవ్ను తీసుకుంటే ఫలితం ఉండొచ్చు.
ఆసీస్తో అంత ఈజీ కాదు
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు టోర్నీలో తనదైన స్టయిల్లో దూసుకొచ్చింది.అత్యంత నిలకడగా విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచి ఎనిమిదో ట్రోఫీకి రెండు అడుగుల దూరంలో నిలిచింది. గాయం నుంచి కోలుకుని సెమీఫైనల్కు సిద్ధమైన కెప్టెన్ అలీసా హీలీ తిరిగి జట్టులోకి రావడం ఆసీస్కు అతిపెద్ద బలం. హీలీ తన చివరి రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసింది, అందులో లీగ్ దశలో ఇండియాపై కొట్టిన మెరుపు (142) వంద కూడా ఉంది. బెత్ మూనీ, లిచ్ఫీల్డ్ కూడా మంచి టచ్లో ఉన్నారు. ఆరు ఇన్నింగ్స్ల్లో 43 రనస్ మాత్రమే చేసిన తాలియా మెక్గ్రాత్ ఫామ్ ఒక్కటే ఆసీస్ను ఇబ్బంది పెట్టే అంశం. యాష్లే గార్డ్నర్ (265 రన్స్, 7 వికెట్లు), అనాబెల్ సదర్లాండ్ (15 వికెట్లు), అలానా కింగ్ (13 వికెట్లు) వంటి వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్లు ఉండటం కంగారూ టీమ్ బలాన్ని అమాంతం పెంచుతోంది. ఆ జట్టులోని ప్రతీ ప్లేయర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చగలిగే సత్తా ఉన్న వాళ్లే. ఈ నేపథ్యంలో ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా ఇండియా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటితేనే ఆసీస్పై గెలిచి ఫైనల్ చేరుకోగలదు.
పిచ్/వాతావరణం
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం బ్యాటింగ్ కు స్వర్గధామంలాంటి పిచ్పై ఈ మ్యాచ్ జరగనుంది. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. గురువారం వర్షం సూచన ఉంది. ఒక వేళ ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్ డే శుక్రవారం నిర్వహిస్తారు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: మంధాన, షెఫాలీ, హర్లీన్, జెమీమా, హర్మన్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోశ్ (కీపర్), దీప్తి శర్మ, స్నేహ్రాణా/ రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్.
ఆస్ట్రేలియా: హీలీ (కెప్టెన్/కీపర్), లిచ్ఫీల్డ్ , ఎలీస్ పెర్రీ,సదర్లాండ్, గార్డ్నర్, తాలియా, మొలినుక్స్, వారెహమ్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షుట్.
