రుతురాజ్ క్లాస్ సెంచరీ.. తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. శ్రీలంక ముందు భారత్-A ఫైటింగ్ స్కోర్!

రుతురాజ్ క్లాస్ సెంచరీ.. తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. శ్రీలంక ముందు భారత్-A ఫైటింగ్ స్కోర్!

India A vs Sri Lanka A : శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ఇండియా-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య మొదలైన వన్డే ట్రై సిరీస్ ఫస్ట్ మ్యాచ్‌లోనే లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ కష్టపెడుతున్నా.. మనోళ్లు అస్సలు తగ్గలేదు. స్టార్టింగ్‌లో వరుసగా వికెట్లు పడి కాస్త తడబడినప్పటికీ.. రుతురాజ్ గైక్వాడ్ సూపర్బ్ సెంచరీ, కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్-ఏ జట్టు 6 వికెట్ల నష్టానికి 277 పరుగుల మంచి స్కోర్ చేసింది.

నిరాశపరిచిన ఓపెనర్లు: 
టాస్ గెలిచిన భారత్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. కానీ టీమిండియాకు అనుకున్నంత మంచి స్టార్టింగ్ దొరకలేదు. నెట్స్ ప్రాక్టీస్‌లో సిక్సర్ల జాతర లేపిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోతాడని అందరూ ఆశపడ్డారు. స్టార్టింగ్‌లో వరుసగా బౌండరీలు కొడుతూ ఊపుమీద కనిపించిన వైభవ్.. కేవలం 12 బంతుల్లో 14 రన్స్ మాత్రమే చేసి మొహమ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా 11 బంతులు ఆడి కేవలం 2 పరుగులకే కరుణరత్నే బౌలింగ్‌లో పెవిలియన్ చేరి షాక్ ఇచ్చాడు.

ప్రియాంష్ ఆర్య దూకుడు: 
ఓపెనర్లు ఇద్దరూ త్వరగానే అవుట్ అయినా.. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాంష్ ఆర్య కాసేపు లంక బౌలర్లపై దూకుడుగా ఆడాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మంచి టచ్‌లో కనిపిస్తూ 32 రన్స్ కొట్టాడు. కానీ దురదృష్టవశాత్తూ 13వ ఓవర్ వద్ద రనౌట్ కావడంతో భారత్ 69 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

గైక్వాడ్ క్లాస్ సెంచరీ.. తిలక్‌తో 150 రన్స్ పార్ట్‌నర్‌షిప్: 
కష్టాల్లో ఉన్న జట్టును సీనియర్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ఆదుకున్నాడు. పిచ్ కండిషన్స్ అర్థం చేసుకుంటూ మొదట్లో మస్తు నెమ్మదిగా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన రుతురాజ్.. ఆ తర్వాత కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను సూపర్బ్‌గా బిల్డ్ చేశాడు. శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వనుజ సహాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో తిలక్ వర్మతో నెలకొల్పిన 150 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ కాసేపటికే అద్భుతమైన హాఫ్ సెంచరీతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ కూడా మొహమ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి అవుటయ్యాడు.

ఆయుష్ బదోనీ మెరుపులు: 
చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోనీ, సూర్యాంశ్ షెడ్జ్ లంక బౌలర్లపై బ్యాట్ ఝలిపించారు. ఈ ఇద్దరూ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. వీరిద్దరి మధ్య 46 పరుగుల ఇంపార్టెంట్ భాగస్వామ్యం నెలకొన్న తర్వాత బదోనీ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అయినప్పటికీ మనోళ్లు నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 277 రన్స్ బోర్డుపై పెట్టారు. శ్రీలంక పిచ్‌లపై ఈ స్కోర్‌ను కాపాడుకోవడం మన బౌలర్లకు పెను సవాల్ గా మారింది.