న్యూఢిల్లీ: మొబైల్ఫోన్ల తయారీలో ఇండియా దూసుకెళ్తోంది. చైనా తర్వాత భారతదేశం రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా అవతరించింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో దేశీయ ఉత్పత్తి 27 కోట్ల యూనిట్లు ఉండొచ్చని కొత్త రిపోర్ట్ పేర్కొంది. ఏడాది క్రితం 25 కోట్ల యూనిట్లు తయారయ్యాయి. ఫోన్లకు డిమాండ్, డిజిటల్ లిటరసీ పెరగడం, పీఎల్ఐ కింద రూ. 38 వేల కోట్ల విలువైన ఇన్సెంటివ్స్ ఇవ్వడం, దశలవారీ తయారీ కార్యక్రమం వంటి వాటి వల్ల 2014–2022 మధ్య మొబైల్ ఫోన్ల తయారీ ఏటా 23శాతం పెరిగిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. దీని ప్రకారం...2022లో 98శాతం కంటే ఎక్కువ ఎగుమతులు 'మేడ్ ఇన్ ఇండియా'వి ఉన్నాయి.
2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇవి కేవలం 19శాతం మాత్రమే ఉన్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు. భారతదేశం గత క్యాలెండర్ సంవత్సరంలో ఉత్పత్తి చేసిన 250 మిలియన్ ఫోన్లలో 20శాతం ఎగుమతి చేసింది. డిమాండ్ తగ్గడం వల్ల 2022లో దేశీయ ఉత్పత్తి వార్షికంగా 3శాతం తక్కువగా ఉంది. అయినప్పటికీ, ప్రీమియమ్ స్మార్ట్ఫోన్ల ఎగుమతులు దూసుకెళ్లాయి. ప్రీమియమైజేషన్ వల్ల తయారీ రంగం సంవత్సరానికి 34శాతం వృద్ధిని సాధించింది. 2022లో తయారైన హ్యాండ్సెట్ల మొత్తం విలువలో యాపిల్ వాటా 25శాతం ఉంది. ఇది 2021లో 12శాతం పెరిగింది. కంపెనీ ఉత్పత్తి సంవత్సరానికి 65శాతం పెరిగింది. విలువ పరంగా, ఇది సంవత్సరానికి 162 శాతం ఎగిసింది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసియా) డేటా ప్రకారం, 2022లో భారతదేశం దాదాపు రూ. 3.5 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసింది. 2023లో రూ.4-4.25 లక్షల కోట్ల విలువైన హ్యాండ్సెట్లను ఉత్పత్తి చేస్తుందని అసోసియేషన్ అంచనా వేసింది.
ఎగుమతుల్లో మూడో స్థానం
చైనా అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా కొనసాగుతోంది. ఇది 2022లో భారతదేశం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫోన్లను తయారు చేసింది. మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న వియత్నాం కంటే భారతదేశం 1.8 రెట్లు ఎక్కువ యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఎగుమతుల విషయంలో చైనా, వియత్నాం తర్వాతే భారతదేశం ఉంది. ఎందుకంటే వియత్నాం ఉత్పత్తిలో ఎక్కువ భాగం ఎగుమతి అవుతుంది. అక్కడ డిమాండ్ ఎక్కువగా లేదు. "మేం భారీ విజయాలను సాధించగలిగాం. భారీ ఉపాధిని సృష్టించగలిగాం. మెగా ఫ్యాక్టరీలను నిర్మించాం. ఎలక్ట్రానిక్స్ తయారీకి భారతదేశం కేంద్రంగా ఎదిగింది" అని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ డిక్సన్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ వచానీ అన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో రూ. 12 వేల కోట్లకు పైగా టర్నోవర్ సాధించామని అన్నారు. మనదేశంలో పట్టణ-, గ్రామీణ డిజిటల్ అంతరం తగ్గుతోంది. దీంతో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ మరింత పెరగనుంది. ఎగుమతులూ మరింత పెరుగుతాయని కౌంటర్పాయింట్ తెలిపింది. భారతదేశ స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో ఫాక్స్కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్లకు 92శాతం వాటా ఉంది. మనదేశం 2023 మొదటి క్వార్టర్లో 13.5 మిలియన్ మొబైల్ ఫోన్ యూనిట్లను ఎగుమతి చేసింది. జూన్తో ముగిసిన రెండవ క్వార్టర్లో మరో 12 మిలియన్ యూనిట్లను ఎగుమతి చేసింది. ఈ ఏడాది జనవరి–-జూన్ మధ్య 7.48 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది. అంతకు ముందు సంవత్సరం వీటి విలువ 2.9 బిలియన్ డాలర్లు.