న్యూఢిల్లీ: ఏ ప్లేయర్ అయినా రెండేళ్లలో గేమ్ను మార్చుకోవచ్చని టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ అన్నాడు. అందుకు హార్దిక్ పాండ్యా ఉదాహరణ అని చెప్పాడు. జట్టులో హార్దిక్ లాంటి మరో ఇద్దరు ఆటగాళ్లు ఉంటే ఇంకా పటిష్టంగా తయారవుతుందన్నాడు. టీ20 ఫార్మాట్లో ప్రయోగాలు చేసేందుకు టీమిండియా జంకుతోందని, దాని నుంచి బయటపడాలని సూచించాడు.
‘మిడిల్ ఓవర్లలో మూమెంటమ్ పెరిగేందుకు ఇద్దరు నుంచి ముగ్గురు ప్లేయర్లు ఉండాలి. హార్దిక్ పాండ్యా రూపంలో ఓ ఆటగాడు సిద్ధమయ్యాడు. టీ20ల్లో అతడ్ని నాలుగో ప్లేస్లో ఆడించాలి. పొట్టి ఫార్మాట్లో ప్రయోగాలు చేస్తూ ఉండాలి. మయాంక్ అగర్వాల్, సంజూ శాంసన్ లాంటి యంగ్స్టర్లు కూడా ఉన్నారు. వీళ్లను కెప్టెన్తోపాటు మేనేజ్మెంట్ బ్యాకప్ చేయాలి. టీ20 ఫార్మాట్ యూత్ది కాబట్టి వాళ్లపై నమ్మకం ఉంచాలి. ఇన్నాళ్లుగా ఐపీఎల్లో ఆడుతున్నా.. ఆ ఫార్మాట్లో ప్రయోగాలు చేయడానికి మనం వెనుకంజ వేస్తున్నాం. టీ20ల్లో భయం లేకుండా ఆడొచ్చు. యువత అలాగే ఆడాలి కూడా. ఐపీఎల్ను మనం మరింతగా వాడుకోవాలి’ అని కపిల్ పేర్కొన్నాడు.